Gautam Gambhir : భారత జట్టు గొప్ప ఓపెనర్లలో ఒకడైన గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటతో పాటు వివాదాలతోనూ బాగా పాపులర్ అయ్యాడని తెలిసిందే. నిరుడు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మైదానంలోనే గొడవ పడి వార్తల్లో నిలిచిన గౌతీ.. తాజాగా తన ఐపీఎల్ రోజులను గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. తనను ఎక్కువ భయపెట్టిన ఆటగాడి పేరు చెప్పాడు.
విధ్వంసక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ల కంటే తనను ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎక్కువగా భయపెట్టాడని గౌతీ వెల్లడించాడు. ‘ఐపీఎల్లో నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడు ఒక్కడే. అది డివిలియర్స్, గేల్ మాత్రం కాదు. మరి ఎవరంటే.. రోహిత్ శర్మ. అందుకనే అతడు క్రీజులోకి వచ్చాడంటే నేను ఎప్పుడూ ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీలతో సిద్ధంగా ఉండేవాడిని. ఒకవేళ సునీల్ నరైన్ కోటా పూర్తయితే ఆ తర్వాతి 16 ఓవర్లు ఎవరితో వేయించాలి? అని ఆలోచించేవాడిని.
ఎందుకంటే.. రోహిత్ ఉన్నాడంటే ఓవర్కు 30 రన్స్ అలవోకగా పిండుకున్నాడు. అందుకనే అతడు నన్ను ఎక్కువగా భయపెట్టేవాడు. ఐపీఎల్లో హిట్మ్యాన్ను ఆపగలిగేవాళ్లు లేరు అని గౌతీ తెలిపాడు. టీమిండియా ఓపెనర్గా 2011 ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడిన గంభీర్.. ఐపీఎల్లో కెప్టెన్గానూ సక్సెస్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఫ్రాంఛైజీకి రెండు ట్రోఫీలు అందించాడు. ఆ తర్వాత మెంటార్ అవతారమెత్తిన గౌతీ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను ప్లే ఆఫ్స్కు చేర్చాడు.
విరాట్ కోహ్లీ, గంభీర్
అయితే.. అనూహ్యంగా 17వ సీజన్ మినీ వేలానికి ముందు అతడు కోల్కతాకు మారాడు. దుబాయ్లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)ను కేకేఆర్ రికార్డు ధరకు కొనడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ మార్చి 23న ప్రారంభం అయ్యే అవకాశముంది. అయితే.. బీసీసీఐ మాత్రం అధికారికంగా షెడ్యూల్ మాత్రం విడుదల చేయలేదు. 2024 ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్గా అడుగుపెట్టనుంది.