1,612 కిలోలు స్వాధీనం.. నలుగురు అరెస్టు
సంగారెడ్డి అర్బన్/ములుగు, జనవరి 26: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2.90 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన 1,000 కిలోల ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొన్నారు. పక్కా సమాచారం మేరకు సదాశివపేట మండలం నంది కంది గ్రామ శివారులో బుధవారం ఈ లారీని పట్టుకొన్నట్టు ఎస్పీ రమణ వెల్లడించారు. షేక్ సలీం, అజీజ్ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, సలీం ఆజాద్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి గంజాయితోపాటు 3 సెల్ ఫోన్లు, రూ.3,500 నగదు స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. నిందితులను పట్టుకొన్న సదాశివపేట సీఐ సంతోష్కుమార్, ఎస్సై అంబర్య, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రూ.90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పట్టున్నట్టు ఎస్పీ డాక్టర్ సంగ్రాం సింగ్జీ పాటిల్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి ములుగు జిల్లాకు 21 బస్తాల్లో ఈ గంజాయిన తరలిస్తున్న వెంబటి రాజశేఖర్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. అతని నుంచి టాటా వెంచర్ వాహనంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్టు తెలిపారు. మరో నలుగురు నిందితులున్నారని, వారిని త్వరలోనే పట్టుకొంటామని చెప్పారు.