హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా బొజ్జ గణపయ్యకు ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో శుక్రవారం గణేశ్ నిమజ్జన వేడుకలు ముగిశాయి. హైదరాబాద్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో గణేశ్ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్వయంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. శోభాయాత్రలను, గణేశ్ విగ్రహ నిమజ్జనాలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, డీజీపీ ఎం మహేందర్రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించారు.
తొలిసారిగా 50 అడుగులతో ఖైరతాబాద్లో మట్టి విగ్రహం
తొలిసారిగా 50 అడుగుల మట్టి గణేశుడిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జన ఘట్టం శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్ గణేశుడికి పూజలు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం 4 వద్ద భారీ గణనాథుడి నిమజ్జనం పూర్తయింది.
విజయవంతంగా నిర్వహించాం
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించినం. ఇం దుకు సహకరించిన ప్రజలందరికీ పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు. అన్ని ప్రభుత్వ విభాగాల సహాయ సహకారాలతో పోలీస్ సిబ్బంది ఓపికగా, అంకితభావంతో విధులు నిర్వర్తించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను వాడుకొని పూర్తిస్థాయిలో అన్ని చర్యలు చేపట్టాం.
– డీజీపీ మహేందర్రెడ్డి