శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. ఉత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయని, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతికి, సాక్షిగణపతి స్వామికి, మట్టితో చేసే మృతికా గణపతి స్వామివారికి ప్రతిరోజు వ్రతకల్ప పూర్వక ప్రత్యేక పూజాధికాలు జరుగుతాయని వివరించారు. శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, రుత్విగణం కార్యక్రమాలతో ప్రారంభమై.. చివరిరోజు కలశోద్వాసన, పూర్ణాహుతి, అవబృదం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, నిమజ్జనం వేడుకలతో ఉత్సవాలు పూర్తవుతాయని చెప్పారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు.