నవరాత్రి పూజలందుకుని, పంసదైన ఫలహారాలు ఆరగించిన బొజ్జ గణపయ్య భక్తులకు ఆశీర్వచనం అందజేసి తిరిగి కైలాసగిరి బాట పట్టాడు. చిరుజల్లుల్లో.. చిందేసిన ఆనందాల నడుమ శుక్రవారం గంగమ్మ ఒడికి వైభవంగా కదిలాడు. కోలాటాలు.. బ్యాండ్ చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పుల నడుమ శుక్రవారం గణేశ్ శోభాయాత్ర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సాగింది. భక్తిభావం ఉప్పొంగింది. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్ కీ జై.. అంటూ గల్లీలన్నీ మార్మోగాయి. మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగాయి. జిల్లావ్యాప్తంగా 2,593 విగ్రహాలు నిమజ్జనానికి రాగా, జిల్లా యంత్రాంగం, ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. చెరువుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా, అవాంఛనీయ ఘటనలేవీ లేకుండా గణపతి నవరాత్రోత్సవాలు పరిపూర్ణమయ్యాయి.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వినాయక నిమజ్జనోత్సవం శుక్రవారం ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు భువనగిరి పట్టణంలో శోభాయాత్ర కనుల పండువలా జరిగింది. చిన్నా, పెద్ద వినాయడి ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేశారు.
భువనగిరిలో కోలాహలంగా..
జిల్లా వ్యాప్తంగా 2,593 గణనాథులను ఏర్పాటు చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 425, మండలంలో 354 విగ్రహాలు ఉన్నాయి. జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత గణపతుల శోభాయాత్ర ప్రారంభమైంది. భువనగిరి పట్టణంతోపాటు మండలాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆబాద్ నుంచి సమ్మద్ చౌరస్తా, ఆజాద్ రోడ్డు, ఖలానగర్, వినాయక చౌరస్త్తా మీదుగా జాతీయ రహదారిపై నుంచి ప్రధాన మార్గంలో జగ్జీవన్ రామ్, హైదరాబాద్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు వరకు శోభాయాత్ర నిర్వహించి, చెరువులో నిమజ్జనం చేశారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని విగ్రహాలను గోధుమ కుంటతోపాటు, స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. భూదాన్పోచంపల్లి మండలంలో ఏర్పాటు చేసిన గణపతులను స్థానిక చెరువుల్లో, బీబీనగర్లో నెలకొల్పిన ప్రతిమలను రాఘవాపురం చెరువులో నిమజ్జనం చేశారు. వలిగొండ మండలంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను మండల కేంద్రంలో నిమజ్జనం చేశారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విగ్రహాలను చాకలిగిద్ద, రాయగిరి చెరువుల్లో వేశారు. అంతకుముందు శోభాయాత్రలో ఆర్కెస్ట్రా పాటలు, మహారాష్ట్ర బ్యాండు, కోలాట నృత్యాలు, పలు రకాల వేషధారణలు, యువతీయువకులు, చిన్నారులు నృత్యాలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు పటాకులు పేల్చారు.
19 చెరువుల్లో నిమజ్జనం
జిల్లాలో 19 చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. ఇందుకోసం మున్సిపాలిటీ, మత్స్య, ఇరిగేషన్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్, వైద్య సిబ్బందిని సిద్ధంగా పెట్టారు. పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. శుక్రవారం ఉదయమే భువనగిరి పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన స్థలం, ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పరిశీలించారు.
పటిష్ట బందోబస్తుతో..
జిల్లా వ్యాప్తంగా జరిగిన వినాయక నిమజ్జనానికి డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణం, పెద్ద చెరువు వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. శోభాయాత్ర, నిజమజ్జనం ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.