హుజూరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులు, రైతులపై ప్రేమ లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రిజర్వేషన్లు ఆపే కుట్ర చేస్తూ దళితులపై విషం కక్కుతుందని చెప్పారు. 23 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టుకున్న బీజేపీ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిందా ..? అని అడిగారు. ఈ దేశంలో అసలైన హిందువులు ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని తెలిపారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మరో 50ఏండ్లు అయినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్ర సంపత్కుమార్, జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పొడేటి రామస్వామి, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్సన్నీ, టీఏవైఎస్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల పాండు, అధికార ప్రతినిధి కొండ్ర సంపత్, రాష్ట్ర కార్యదర్శి మీసాల సాయిలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదాసి ప్రభాకర్, నాయకులు కల్వల ఆనంద్, పొడేటి వేణు, మడిపల్లి చక్రపాణి, రాచపల్లి సాగర్, రాసపెల్లి శ్రీకాంత్, గిన్నారపు ప్రవీణ్కుమార్, మారపల్లి సదయ్య, పుల్లూరి రాజు, రాచపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.