ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. అత్యవసర వినియోగం కోసం తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలలోని భూగర్భ బంకర్లలో నిల్వ ఉంచిన 3.8 కోట్ల బ్యారెళ్ల నుంచి కొంత చమురును కేంద్రం బయటకు తెస్తున్నది. పెట్రోలు ఎగుమతి దేశాలు బుద్ధిపూర్వకంగా డిమాండ్ కన్నా తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించే చైనా, భారత్, జపాన్ తదితర దేశాలు తమ నిల్వలను సమన్వయంతో బయటకు తీస్తున్నాయి. పెరిగిపోతున్న ఇంధన ధరలను అదుపులో పెట్టడం కోసం దేశంలో మొదటిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు పలు దేశాలలో ఆర్థిక రంగం మళ్ళీ చిగురిస్తున్నది. మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా అత్యంత వేగంగా పుంజుకున్నది. ఇందుకు దేశాధ్యక్షుడు బైడెన్ తీసుకున్న చర్యలే కారణం. పేదలను ఆదుకునేందుకు, చిన్న తరహా వ్యాపారాలను నిలబెట్టడానికి బైడెన్ వివిధ పథకాలను చేపట్టారు. కానీ పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఇంధన సరఫరా జరగడం లేదు. దీంతో సాధారణ వినియోగదారులే కాకుండా వ్యాపార సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపు పెట్రోలు సరఫరా పెంచాలన్న అభ్యర్థనలను చమురు ఉత్పత్తి దేశాలు తిరస్కరించాయి. దీంతో పెట్రోలు ధరలను, కొరతను తగ్గించడానికి నిల్వలను బయటకు తీయాలని అమెరికా ఇతర దేశాలకు సూచించింది.
నాగరికతకు నీరు ప్రాణాధారమైనట్టే, ఆధునిక అభివృద్ధికి ఇంధన వనరులు అత్యావశ్యకం. మన చమురు అవసరాల కోసం 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వర్ధమాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు పోవాలి. పునరుత్పాదక వనరుల ఆవిష్కరణ, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సుంకాలు, పన్నులు విధించడం ద్వారా ఇంధనాన్ని కాసులు కురిపించే కామధేనువుగా చూడవద్దు. 2014నుంచి 18 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని అనేకసార్లు పెంచి రూ.10లక్షల కోట్లకు పైగా ఆర్జించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు కూడా వినియోగదారుడికి ఊరట లభించలేదు. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో కూడా ఇంధన ధరల ప్రభావం ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించవలసిన అవసరాన్ని గుర్తించాలి.