హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉచిత విద్య, ఉచిత వైద్యం.. తెలంగాణ రాష్ట్రంలో ఈ సదుపాయాలు అందుకోని పేద కుటుంబం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసినా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి మాత్రం తెలియలేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని వాగ్ధానాలు చేసిన బండి సంజయ్ ప్రసంగంలోని కొన్ని అంశాలు.. వాస్తవాలను ఓసారి గమనిస్తే..
బండి: బీజేపీ సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేసినా మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం ఫైలునే.
వాస్తవం: రాష్ట్రంలో ఉచితంగా విద్య, వైద్యం ప్రజలకు ఎప్పటినుంచో అందుతున్న విషయం బండికి తెలియకపోవటం ఆయన అజ్ఞానానికి నిదర్శమని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న విషయం తెలియదా? ప్రభుత్వ దవాఖానల్లో వసతులు పెంచి వైద్యరంగాన్ని పటిష్ఠం చేయడం, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలతో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేయడం కనిపించటంలేదా? ఫైళ్లపై సంతకం చేయడం తర్వాతి సంగతి.. కేంద్రం నుంచి రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బండి సంజయ్: రైతుల కోసం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు.
వాస్తవం: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులపై దాడులు చేసిందెవరో ప్రపంచం మొత్తం చూసింది. బీజేపీ కార్యకర్తలే రాళ్లు, కర్రలతో రైతులు, పోలీసులపై దాడులు చేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పటికీ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
బండి: బీసీ కులగణన గురించి తర్వాత, ముందు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టాలి.
వాస్తవం: సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పోర్టల్ కూడా ఉన్నది. గూగుల్లో సమగ్ర కుటుంబ సర్వే అని టైప్ చేస్తే మొత్తం వివరాలు పీడీఎఫ్ల రూపంలో కూడా కనిపిస్తాయి.
బండి: కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం.
వాస్తవం: బీజేపీలో ప్రతి పెద్ద నేత కుటుంబంలోని అనేకమంది పార్టీ, ప్రభుత్వాల పదవులు అనుభవిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా అనేక మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల పిల్లలు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ యూపీలో ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి. ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బస్వరాజ్ బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై కూడా గతంలో 1988-89 మధ్య సీఎంగా పనిచేశారు.
బండి సంజయ్: గత ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదు.
వాస్తవం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతుబీమా వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. రైతుబీమా కింద 2018-19 నుంచి 2020-21 వరకు ప్రభుత్వం రూ.3,384.85 కోట్లు చెల్లించింది. ఈ ఒక్క ఏడాదే ఈ పథకంలో 35.64 లక్షల మంది రైతులు ఎన్రోల్ అయ్యారు. రైతుబందు పథకం ద్వారా 2018 నుంచి 2021 వరకు రైతులకు ఏకంగా రూ.43036.64 కోట్లు చెల్లించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు ఇప్పటివరకు రూ.4,352 కోట్లు ఖర్చుచేసింది. కాళేశ్వరం వంటి అనేక భారీ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు పుష్కలంగా నీటిని అందిస్తున్నది.