హైదరాబాద్: ఎయిడ్స్ రోగులకు త్వరలో ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఎయిడ్స్ మరణాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎయిడ్స్ డే సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పారు. వ్యాధి నివారణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడటం తగదన్నారు సూచించారు. అవగాహన పెరగడంతోనే 90 శాతం మరణాలు తగ్గాయని చెప్పారు.
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7 శాతంగా ఉందని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నిరోధక చర్యలతో అది 0.4 శాతానికి తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం 167 ఐసీటీసీ కేంద్రాలను, 22 ప్రభుత్వ ఏఆర్టీ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు, ఆసరా పెన్షన్ అందిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్, వరంగల్లో ఎయిడ్స్, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎయిడ్స్పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైందని, ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమేయాలన్నారు. ఛాతీ దవాఖాన పరిసరాల్లో ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్కు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే సీఎం లక్ష్యమన్నారు.