కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఏడో విడుత క్యాంపునకు విశేష స్పందన లభించింది. లండన్కు చెందిన రమణ దన్నపనేని 13 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయగా వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ డాక్టర్ మా బిడ్డల పాలిట దేవుడని తల్లిదండ్రులు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపడం కనిపించింది.
– విద్యానగర్, మార్చి 12
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకారం చుట్టిన హెల్త్ ప్రొఫైల్ స్పీడందుకున్నది. ఈ నెల 5న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన మరుక్షణం నుంచే రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య యంత్రాంగం కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నది. జిల్లాలో గుర్తించిన 18 ఏండ్ల పైబడిన 4,22,812 మందికి రెండు నెలల్లో పరీక్షలు చేయడమే లక్ష్యం కాగా, నిత్యం 50 బృందాలతో ఇంటింటికీ వెళ్లి రక్త నమునాల టెస్టులు చేస్తున్నది. ప్రధానంగా బీపీ, షుగర్, కిడ్నీ, లంగ్స్, క్యాన్సర్పైనే దృష్టి సారించగా, ఇప్పటివరకు 5,837 మందికి సంబంధించి 8,331 రక్త పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.
-రాజన్న సిరిసిల్ల, మార్చి 12 (నమస్తే తెలంగాణ)
విద్యానగర్, మార్చి 12 : కరీంనగర్లోని ప్రతిమ దవాఖాన నిరుపేదలకు నిరుపమాన సేవలందిస్తూ ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్నది. ఎన్నో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేస్తూ భరోసానిస్తున్నది. ఇదేకోవలో గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వైద్యశాల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావు ఆలోచనల మేరకు 2017లో ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా హృద్రోగాలతో బాధపడుతున్న పిల్లలకు వైద్యసేవలందించాలని నిర్ణయించారు. లండన్లో ఉంటున్న జగిత్యాలకు చెందిన రమణ దన్నపునేని ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు ముందుకువచ్చారు. అనుకున్నదే తడవుగా 2017లో తొలిసారిగా ప్రతిమ వైద్యశాలలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి 20 మందికి శస్త్రచికిత్సలు చేశారు. అప్పటి నుంచి ఆరునెలలకోసారి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో క్యాంపులు నిర్వహించలేదు. ఏడో విడుత శిబిరాన్ని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఇందులో ఏడురోజుల పసిపాపకు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. అయితే మొత్తంగా ఏడుసార్లు నిర్వహించిన వైద్య శిబిరాల్లో 106 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారు. సుమారు రూ. 5లక్షల దాకా ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా, ఏడో సారి శిబిరం విజయవంతంగా పూర్తి కావడంతో శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి, – హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ వైద్య నిపుణుడు రమణ దన్నపనేని, పిమ్స్ పిడియాట్రిక్స్ హెచ్వోడీ డాక్టర్ చెన్నాడి అమిత్, డాక్టర్ చెన్నాడి జగన్మోహన్రావు, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ పిఎల్ జాన్ ఇజ్రాయిల్, డాక్టర్ రాంచందర్రావు, రవీందర్రెడ్డి, ఆశిష్, డాక్టర్ నిఖిల్తో పాటు యూకే, యుఎఈ వైద్యబృందం పాల్గొన్నారు.
గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్న. ప్రతిమ దవాఖానలో ఇప్పటి వరకు ఆరు క్యాంపులు నిర్వహించినం. 106 మంది పిల్లలకు ఆపరేషన్లు చేసినం. ఇందులో ఏడురోజుల పసిపాపకు విజయవంతంగా సర్జరీ చేశాం. మున్ముందు మరింతమందికి సేవలందిస్తాం. మాజీ ఎంపీ వినోద్, పిమ్స్ చైర్మన్ శ్రీనివాసరావు చొరవ ప్రశంసనీయం. భవిష్యత్లో మరింతమంది పిల్లలకు చికిత్స అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నం. – చెన్నాడి అమిత్, పిమ్స్ పిడియాట్రిక్స్ హెచ్వోడీ
మా అబ్బాయి పుట్టిన మూడో రోజునే వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉందని చెప్పారు. హైదరాబాద్లోని రెయిన్ బో హాస్పిటల్కు తీసుకువెళ్లాం. వైద్యులు పరీక్షించి రూ.4 నుంచి 5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బు లేక మందులు రాయించుకున్నాం. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చాం. బాబు కిస్విన్ తేజ్ను పరీక్షించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు.
– తగరం శ్రావణి రాజశేఖర్, బుద్దారం (మంచిర్యాల జిల్లా)
తెలంగాణలో జన్మించి ఇక్కడి చిన్నారులకు వైద్యసేవలందించడం ఆనందంగా ఉన్నది. తనను సంప్రదించగానే ప్రతిమ ఫౌండేషన్తో కలిసి ఈ బృహృత్తర కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకువచ్చిన. ప్రతి 100 మంది చిన్నారుల్లో ఒకరు హృద్రోగాలతో బాధపడుతున్నారు. ఏడాదిలోపే శస్త్రచికిత్సలు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. రాష్ట్రంలో ముగ్గురు మాత్రమే చిన్నపిల్లల గుండె సంబంధ వ్యాధి నిపుణులు ఉన్నారు. చికిత్స అందక ఎందరో చిన్నారులు మరణిస్తుండడం కలిచివేసింది. అందుకే పుట్టిన గడ్డకు సేవలందించాలని నిర్ణయించుకున్న. మున్ముందు మరిన్నీ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాను.
– రమణ దన్నపునేని, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ వైద్యుడు
ప్రైవేట్లో సెల్స్మెన్గా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఒక్కగానోక్క కూతురు గుండె వ్యాధితో బాధపడుతుందని వైద్యులు నిర్ధారించారు. శస్త్ర చికిత్స కోసం రూ. 5లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. చికిత్స కోసం హైదరాబాద్, పుట్టపర్తి వెళ్లినా నయం కాలేదు. పాపకి పుట్టుకతోనే ఒకటే కిడ్నీ ఉండడంతో ఆపరేషన్ అనగానే భయపడ్డాం. డాక్టర్ రమణ పాపకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నది.
– పెద్ది ఆది లక్ష్మీ వెంకటనరేందర్, కరీంనగర్
పాపకు పుట్టుకతోనే గుండెకు రెండు రంధ్రాలు ఉన్నాయని హైదరాబాద్లోని ఓ దవాఖానకు వెళ్తే వైద్యులు చెప్పారు. వయస్సు పెరిగేకొద్ది ఒకటి పూడుకుపోతుందని, మరోదానికి శస్త్రచికిత్స అవసరమన్నారు. ఇందుకు రూ. 5లక్షలు తీసుకొని రమ్మన్నారు. పేదరికంతో బాధపడుతున్న మేం చేసేదేం లేక ఇంటికి వచ్చినం. ఇప్పుడు మా పాపకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ప్రాణభిక్ష పెట్టిన డాక్టర్లకు రుణపడి ఉంటం.
– నేరెళ్ల సంధ్యా నరహరి, మెట్పల్లి (జగిత్యాల )