న్యూఢిల్లీ: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. సీనియర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ సహా నలుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనీకి కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కరోనా నుంచి కోలుకునే వరకు వారు ఐసోలేషన్లోనే ఉంటారని తెలిపింది.
అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం బుధవారం పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ అని తేలింది. కాగా, వీరితో పాటు సపోర్ట్ స్టాఫ్లోనూ పలువురికి పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
వీరంతా వారం రోజుల పాటు ఐసొలేషన్లో ఉండి.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్ వస్తేనే తిరిగి జట్టుతో కలవనున్నారు. కాగా, ఆటగాళ్లు కరోనా బారినపడిన నేపథ్యంలో బ్యా్ట్స్మెన్ మయాంక్ అగర్వాల్ను జట్టులోకి ఎంపికచేశారు.