నర్సింహులపేట, మే 1 : మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లంచం ఇచ్చిన వారివి మాత్రమే కాంటా పెడుతున్నారని, కొనుగోలు కేంద్రం వైపు ఎవరూ రావడం లేదని, గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో కాంటా ఆలస్యమవుతుందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన సత్యవతిరాథోడ్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 50 వేల గన్నీ బస్తాలు అవసరం ఉంటే కేవలం 15 వేల బస్తాలు ఇచ్చి మిగతావి రైతులనే తెచ్చుకోవాలని చెప్పి చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. ఒక్కో బస్తాను రూ.25 నుంచి రూ.30 వరకు రైతులు కొంటున్నారని, దీంతో బస్తాకు రూ.15 నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్తో మాట్లాడి రైతులకు గన్నీ సంచులు ఇచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. కొనుగోలులో జాప్యంతో వర్షం వస్తే పంట మొత్తం నీటిపాలవుతుందని, దీనికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ సర్కార్కు వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.