కెరమెరి, జూలై 4 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దేవుడ్పల్లి బీట్ పరిధిలోని సుర్దాపూర్ శివారులో పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. పోడు భూముల్లో రైతులు సాగు చేయకుండా శనివారం జేసీబీతో తవ్వకాలు ప్రారంభించారు. ఉదయం నుంచి చినుకులు కురుస్తున్న సమయంలో అటవీ శాఖ చేపట్టిన తవ్వకాల విషయం తెలుసుకున్న పోడు రైతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి రైతులు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో అధికారులు, పోడు రైతుల మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరతరాల నుంచి భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తమ బతుకులు నాశనం చేయొద్దని వేడుకున్నారు. కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారి పక్కన గల భూములతోపాటు దాదాపు 150 ఎకరాల పోడు భూములను అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా అటవీ భూములను సాగు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, ఇదే కా కుండా మరికొన్ని భూములను సైతం స్వాధీ నం చేసుకుంటామని హెచ్చరించారు.