న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు అత్యంత నిరాదరణకు గురవుతున్నాయి. ఇండస్ట్రీని కృత్రిమ మేధస్సు (ఏఐ) భయాలు వెంటాడుతుండగా.. ఇంచుమించుగా గడిచిన రెండేండ్లలో టాప్-5 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు సగానికి హరించుకుపోవడం గమనార్హం. 2024 ఆగస్టులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా కంపెనీల మార్కెట్ విలువ కలిపితే గరిష్ఠంగా రూ.33.71 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రస్తుతం రూ.18.15 లక్షల కోట్లకే పరిమితమైంది. ఈ రెండేండ్లలో 46 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఐటీ షేర్లలో పెట్టుబడులు గత కొన్నాళ్లుగా మదుపర్లను నిండా ముంచుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, విదేశీ మార్కెట్లలో బలహీనపడ్డ డిమాండ్, మందగించిన ప్రాజెక్టుల కదలికలు అన్నీ కూడా ఐటీ సంస్థలను ఆర్థికంగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ సేవలు, తద్వారా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం.. పరిశ్రమను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే రేటింగ్స్ ఏజెన్సీలు ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలను నిరాశాజనకంగా అంచనా వేస్తున్నాయి. ఈ ప్రభావం అంతిమంగా స్టాక్ మార్కెట్లలోని ఆయా కంపెనీల షేర్ల ట్రేడింగ్పైనే పడుతున్నది. భారతీయ ఐటీ సేవల సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో పేలవమైన ఆర్థిక ఫలితాలనే ప్రకటించవచ్చని జేపీ మోర్గాన్, జేఎం ఫైనాన్షియల్ అంచనా వేస్తుండటం.. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తాజా అంచనాల మధ్య ఈ నెల 9న విడుదల కానున్న టీసీఎస్ ఆర్థిక ఫలితాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
అమెరికాలో ట్రంప్ సర్కార్ నిర్ణయాలు సైతం భారతీయ ఐటీ ఇండస్ట్రీని కుదేలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఐటీ కంపెనీల అమెరికా ఆదాయానికి గండికొట్టిన ట్రంప్.. వీసా నిబంధనల కఠినతరంతో ఇక్కడి ఉద్యోగావకాశాలనూ పరిమితం చేసేశారు. నిజానికి దేశీయ ఐటీ సంస్థలకు విదేశీ ప్రాజెక్టుల ద్వారానే ప్రధానంగా ఆదాయం చేకూరుతున్నది. కానీ అమెరికాతోపాటు, ఐరోపా దేశాల్లోనూ ఆదాయం ఇటీవలికాలంలో తగ్గిపోతున్నది. ఇందుకు ఏఐతోపాటు స్థానిక విధానాలూ కారణమే. ఇక విదేశీ ఐటీ సంస్థల వ్యాపారావకాశాలూ నీరసంగానే ఉన్నాయి. ఏప్రిల్-జూన్లోనూ యాక్సెంచర్ ఆర్థిక ఫలితాలు, గైడెన్స్ నిరాశాజనకంగానే ఉండొచ్చన్న అంచనాలున్నాయి మరి.
రిలయన్స్ ఇండస్ట్రీస్.. భారతీయ స్టాక్ మార్కెట్లలో లీడర్గా కొనసాగుతున్నది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.17.65 లక్షల కోట్లుగా ఉన్నది. నిజానికి 2024 జూన్లో రూ.21.20 లక్షల కోట్లుగా ఉండేది. ఈ రెండేండ్లలో షేర్ వాల్యూ 16.7 శాతం క్షీణించింది. అయినప్పటికీ దేశీయ టాప్-5 ఐటీ సంస్థల మార్కెట్ విలువ ఒకెత్తు.. రిలయన్స్ విలువ ఒకెత్తుగా ఉండటం విశేషం. రిలయన్స్ మార్కెట్ విలువతో పోల్చితే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రాలన్నింటి మార్కెట్ విలువ రూ.50వేల కోట్లు మాత్రమే ఎక్కువ.