కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసరలోని పెద్దమ్మ చెరువు దగ్గరున్న హరితవనాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీసర హరితవనం పరిధిలో 1248 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తున్నామని, హరితహారం కింద 1.74లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, 1.14 లక్షలు నాటడం పూర్తయ్యిందని, మిగిలిన 60 వేల మొక్కలు నాటే పనులు సాగుతున్నాయన్నారు. హరితవనాన్ని పూర్తిగా కలియతిరిగి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం శాంతికుమారి, కలెక్టర్ హరీశ్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ పద్మజారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.