ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్నది. ఇతర పార్టీలు పోటీలో నిలువకపోవడం.. ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఎలాంటి పోటీ లేకుండానే గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మరోసారి ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇదిలావుండగా ఏకగ్రీవ ఎన్నికపై జిల్లా గులాబీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రంగారెడ్డి, నవంబర్ 26, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ మేరకు శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అమయ్కుమార్ అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎం.చంపాలాల్ సమక్షంలో ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఏకగ్రీవ ఎన్నికపై ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజులకు ఏకగ్రీవ ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రెండు స్థానాలకుగాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయగా, నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా నామినేషన్ పత్రం అసంపూర్తిగా ఉన్న కారణంగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ఏకగ్రీవ ఎన్నికకు లైన్క్లియర్ అయ్యింది. అయితే వరుసగా రెండోసారి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతోపాటు ఏకగ్రీవ ఎన్నిక వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల అధికారులు అందజేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియనున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్దే హవా…
ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా వరుసగా రెండోసారి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయగా, ఈ ఎన్నికల్లో మాత్రం మెజార్టీ ఓటర్లుండడంతోపాటు బలమైన పార్టీగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్దే జోరు కొనసాగుతూ వస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మూడు దఫాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా, వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కుంచుకొని బలమైన పార్టీగా నిలిచింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పట్టభద్రులు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టి వాణిదేవిని ఎన్నుకున్నారు.
శుభాకాంక్షల వెల్లువ..
రెండోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్రెడ్డికి జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం బయట టీఆర్ఎస్ నేతలతో సందడిగా మారింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజులకు టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఇంటి వద్ద డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితోపాటు మొయినాబాద్ జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా ఎమ్మెల్సీ కసిరెడ్డి
ఆమనగల్లు, నవంబర్ 26: రెండవ సారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహబుబ్నగర్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెంకట్రావు నుంచి ఆయన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి , ఎంపీలు, రాములు, శ్రీనివాస్రెడ్డిలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
మాకు రెండోసారి అవకాశాన్నిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా జిల్లా మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
కోడ్ ముగిసింది
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి అమల్ల్లోకి వచ్చిన కోడ్ ముగిసింది. జిల్లాలోని రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో డిసెంబర్ 16 వరకు వర్తించే ఎన్నికల కోడ్ శుక్రవారంతో ముగిసింది.