అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల ఆచూకీ కోసం రెండో రోజు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలను చేపట్టారు. విహార యాత్రకు వచ్చిన హైదరాబాద్ బేగంపేటలోని రసూల్పుర ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు విహార యాత్రలో భాగంగా ఆదివారం విశాఖ ఆర్కే బీచ్కు చేరుకున్నారు.
సముద్రంలో స్నానాలకు దిగిన బృందంలోని సిహెచ్ శివ(24), కె. శిమకుమార్(21), మహ్మద్ అజీజ్ సముద్రంలో కొద్దిగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో వచ్చిన పెద్ద కెరటం ముగ్గురిని లోపలికి వెళ్లింది. గమనించిన మిగతా స్నేహితులు అరవడంతో తీరంలో ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి వెళ్లి సిహెచ్ శివను ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఉపిరితో ఉన్న అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కె. శిమకుమార్, మహ్మద్ అజీజ్ ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం సాయంత్రం నుంచే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం కనబడ లేదు.
సోమవారం ఉదయం నుంచే మరోసారి విశాఖ తీర ప్రాంత పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరో ఘటనలో విశాఖ పాండురంగాపురం తీరానికి వచ్చిన ఒడిశాకు చెందిన యువకులు స్నానానికి సముద్రంలో దిగారు. సముద్రంలో కాస్త ముందుకు వెళ్లిన సుష్మిత త్రిపాఠిని పెద్ద కెరటం లాక్కెళ్లింది. ఆమెను గజ ఈతగాళ్లు ఒడ్డుకు తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది.