న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వచ్చిన సంస్థలు మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఇప్పటిదాకా 50కిపైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా, లక్ష కోట్ల రూపాయలకుపైగా నిధులను చేజిక్కించుకున్నాయి. రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైనట్లు ప్రైమరీ మార్కెట్ ట్రాకర్ ‘ప్రైమ్ డాటాబేస్’ తాజా గణాంకాలు చెప్తున్నాయి. కేవలం ఒక్క ఏడాదిలో ఈ స్థాయి నిధుల సమీకరణ ఇదే తొలిసారి అని పేర్కొన్నది. ఈ ఏడాది మొదలు గత నెలాఖరుదాకా వచ్చిన ఐపీవోల సంఖ్య 43గా ఉన్నది. ఇవి స్టాక్ మార్కెట్ మదుపరుల నుంచి రూ.73,523.82 కోట్లను సేకరించాయి. ఇక ఈ నెలలో 8 పబ్లిక్ ఇష్యూలు రాగా, దాదాపు రూ.29,600 కోట్లను అందుకున్నాయి. ఇందులో పేటీఎం భారీ పబ్లిక్ ఇష్యూ కూడా ఉన్నది. దీంతో మొత్తం నిధుల సమీకరణ రూ.1.03 లక్షల కోట్లను దాటిపోయింది. 2017లో 36 సంస్థలు ఐపీవోల ద్వారా రూ.67,147.44 కోట్ల నిధులను సమీకరించాయి. ఇదే ఇప్పటిదాకా రికార్డు. ఈ ఏడాదితో ఆ ఘనత చెరిగిపోయినైట్లెంది.
ఈ నెలలోనే అధికం
ఈ ఏడాదిలో ఐపీవోలు అత్యధికంగా వచ్చింది మార్చి నెలలోనే. గరిష్ఠంగా 9 సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. అయితే ఈ నవంబర్ నెలలో ఇప్పటికే 8 వచ్చాయి. ఇందులో నైకా, పాలసీబజార్, జొమాటో, పేటీఎం వంటివి ఉన్నాయి. సిగాచీ ఇండస్ట్రీస్, సఫైర్ ఫుడ్స్ ఇండియా, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, టార్సన్స్ ప్రోడక్ట్స్ అండ్ గో ఫ్యాషన్ (ఇండియా) పబ్లిక్ ఇష్యూలు సైతం ఇదే నెలలో ఉన్నాయి. దీంతో మార్చి రికార్డును నవంబర్ అధిగమించనున్నది. దాదాపు రూ.7,250 కోట్ల స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీవో కూడా ఈ నెల 30న ఉన్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఓయో, ఫామ్ఈజీ, డెలివరీ, మొబిక్విక్, ఇక్సిగో వంటి వెంచర్లూ ఐపీవోలకు రానున్నాయి.
రికార్డులే.. రికార్డులు
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది రికార్డుల వర్షం కురిసింది. అనేక అంశాల్లో 2021.. గతంలో నమోదైన ఘనతల్ని తుడిచేసి కొత్తవి నమోదు చేసింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ హైకి చేరింది ఈ ఏడాదిలోనే. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవో వచ్చింది కూడా ఈ సంవత్సరమే. పేటీఎం ఐపీవో విలువ రూ.18,300 కోట్లు. దీంతో అప్పటిదాకా ఉన్న కోల్ ఇండియా ఐపీవో రికార్డు కనుమరుగైపోయింది. స్టాక్ మార్కెట్లలోకి కొత్త మదుపరులు కూడా ఈసారే ఎక్కువగా వచ్చారు. 2021లో 10 లక్షలకుపైగా కొత్త ఇన్వెస్టర్లు నమోదయ్యారు. ప్రతీ నెలా సగటున సుమారు లక్ష కొత్త మదుపరులు రావడం గమనార్హం. బ్యాంక్ డిపాజిట్ల వడ్డీరేట్లు పడిపోవడం, పెద్ద సంఖ్యలో స్టార్టప్లు స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తుండటంతో రిటైల్ మదుపరులు ఎక్కువగా పెట్టుబడులకు వస్తున్నారు.