ఢిల్లీ : దేశ ఆహార భద్రతను కాపాడాలంటే గత సంవత్సరం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆహార భద్రత పథకం లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడేకంటే ముందు ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కరోనా సంక్షోభం సమయంలో సైతం రైతులు పంటలు పండించి ఆహార ధాన్యాల కొరత లేకుండా చూశారన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో రైతుల ఆత్మగౌరవాన్ని తిరిగి పునరుద్ధరించాలన్నారు.
దేశ ఆహార భద్రతకు ముప్పు కలిగించే నల్ల వ్యవసాయ చట్టాలను మోదీ తీసుకువచ్చారన్నారు. దేశ ఆహార భద్రతను కాపాడాలంటే, ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ద్వారా రైతుల గౌరవాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చిన రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుండి ఢిల్లీ సరిహద్దుల్లో క్యాంప్ వేసి నిరసన చేపడుతున్నారు. వీరిలో 200 మంది రైతుల బృందం సెంట్రల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనను చేపట్టింది.