హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో ఓ వైపు వానలు పడుతుండగా.. మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తున్నది. ఈ నెల 13 వరకు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, నాగర్కర్నూల్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్టు పేర్కొన్నది. కొన్ని చోట్ల భారీవాన పడింది. పలు మండలాల్లో సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో భారీ వడగండ్లు పడ్డాయి. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారంలో అత్యధికంగా 9.43, గజ్వేల్ మండలం బెజ్గాంలో 8.28, చిన్న కోడూర్ మండలంలోని పెద్దకోడూర్లో 7.78 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 12న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలపైన నమోదవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అత్యల్పంగా 15.2 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా నవీపేట్లో అత్యధికంగా 34.1 డిగ్రీల ఉష్ణోగ్రత సమోదైంది.