హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 14,797 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,087 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 73.22 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది. డ్యామ్కు జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 58 టీఎంసీల వరద వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాలతో పాటు జలాశయం పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యామ్లోకి నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.