అమరావతి : అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా రేణిగుంట విమానశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రేణిగుంట విమానశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను హైదరాబాద్కు పంపిస్తున్నారు .
స్పైస్జెట్, ఎయిరిండియా విమానాలను హైదరాబాద్కు, హైదరాబాద్, రేణిగుంట ఇండిగో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. కాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చే మార్గాన్ని టీటీడీ అధికారులు ముందస్తుగా మూసివేశారు. రెండవ కనుమదారిలోని హరిణికి సమీపంలో రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. వాటిని సంబంధిత అధికారులు తొలగించారు. భారీ వర్షం కారణంగా అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాపవినాశనం రహదారిని మూసివేశారు.