మాచారెడ్డి, మార్చి 28: కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) శివారులో చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్లో నివాసం ఉండే వేల్పూరి రాధాకృష్ణమాచారి (46) నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఆయన తల్లి సువర్ణ (70), భార్య కల్పన (37), కొడుకులు రాఘవాచారి, శ్రీరాం (10)తో కలిసి జెల్లీ నరేందర్ (47)కు చెందిన కారును అద్దెకు తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి శ్రీసీతారామస్వామి దర్శనానికి సోమవారం బయల్దేరారు. ఘన్పూర్(ఎం) శివారులో వీరి కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న రాధాకృష్ణమాచారి, కల్పన, శ్రీరాం, సువర్ణతోపాటు నరేందర్ అక్కడిక్కడే మృతిచెందారు. రాధాకృష్ణ పెద్ద కొడుకు రాఘవ కారులో నుంచి బయట పడటంతో తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.