న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభిస్తున్నవేళ అత్యంత కీలకమైన ఐదు ల్యాబోరేటరీలు నిధుల కొరతతో మూతపడ్డాయి. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించాలంటే కచ్చితంగా జీనోమ్ సీక్వెన్స్ నిర్వహించాలి. దీంతో ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబులపై టెస్టుల ఒత్తిడి పెరిగింది. ఏడాది కాలంలో దేశంలోని అన్ని ల్యాబులు కలిసి 1.60 లక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ చేశాయి. ఒక్క డిసెంబర్లోనే 25 వేల శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్స్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలో అవసరమైన పలు రకాల కెమికల్స్కు కొరత ఏర్పడిందని, వాటిని సమకూర్చుకొనేందుకు నిధులు లేకపోవటంతో ల్యాబులు మూతపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
ఉద్ధృతంగా కరోనా మహమ్మారి వ్యాప్తి
దేశంలో కరోనా ఉద్ధృతి ఇంకా తగ్గడం లేదు. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,17,532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. కొత్తగా 491 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,87,693కు పెరిగింది. రోజువారీ, వీక్లీ పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 22.66 లక్షల(63%) హెల్త్కేర్ వర్కర్లు, 33 లక్షల(58%) మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 18.66 లక్షల(39%) మంది వృద్ధులు ప్రికాషన్ డోసు వేసుకొన్నారని కేంద్రం గురువారం వెల్లడించింది. 12-14 ఏండ్ల వారికి కరోనా టీకాపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పష్టత ఇచ్చారు. శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ణయం తీసుకొంటామని గురువారం పేర్కొన్నారు. సెకండ్ వేవ్తో పోలిస్తే ప్రస్తుత కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు తెలిపారు.
ఒమిక్రాన్ను నిలువరిస్తున్న బూస్టర్
కొవిడ్ బూస్టర్ డోసులు శరీరంలో యాంటిబాడీలను 2.5 రెట్లు పెంచుతున్నాయని, ఈ యాంటిబాడీలు ఒమిక్రాన్ను నిలువరిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రిసెర్చ్(ఎన్ఐహెచ్ఆర్) పరిశోధకులు బూస్టర్ డోసుల పనితీరుపై అధ్యయనం నిర్వహించారు. కేవలం రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొన్నవారిలో యాంటిబాడీలు ఒమిక్రాన్ను నిలువరించడం లేదని పేర్కొన్నారు. రెండోడోసు వేసుకొన్న మూడు నెలల తర్వాత యాంటిబాడీలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు.
అమెరికాకు సర్వీసులను పునరుద్ధరించిన ఎయిరిండియా
అమెరికాకు వెళ్లాలనుకొంటున్న భారతీయులకు శుభవార్త. 5జీ సేవల అమలుతో విమానాల నావిగేషన్ వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న కారణంతో బుధవారం నిలిపివేసిన అమెరికా సర్వీసులను ఎయిరిండియా పునరుద్ధరించింది. బీ777 విమానం రాకపోకలకు బోయింగ్ నుంచి అనుమతులు రావడంతో సర్వీసులను ప్రారంభించినట్టు ఎయిరిండియా పేర్కొంది. న్యూయార్క్లోని జేకేఎఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు గురువారం ఉదయం తొలి విమానం ప్రయాణమైనట్టు తెలిపింది.