న్యూఢిల్లీ : ఈ నెల 26న వినీలాకాశంలో బ్లడ్మూన్ కనువిందు చేయనుంది. భూమికి దగ్గరగా రావడంతో పాటు సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు పెద్దగా కనిపించనున్నాడు. ఎరుపు, నారింజ రంగుల్లో దర్శనమివ్వనున్నాడు. ఈ ఏడాదిలో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అమెరికాల్లో కనిపిస్తుంది. భారత్లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చాలా ప్రదేశాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్లడ్మూన్ పాక్షికంగా కనిపిస్తుంది. మళ్లీ జూన్ 10న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ తర్వాత నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం, ఏడాది చివర డిసెంబర్ 4న మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది.
ఒకే సరళరేఖపై ఉన్న సూర్య, చంద్రుల మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చందగ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతితో ధవళ వర్ణంలో మెరిసే జాబిల్లి ఆనాడు వెలవెలబోతుంది. ప్రతి నెలా భూమి, సూర్య, చంద్రులు ఒకే సరళరేఖ పైకి వస్తుంటారు. అయితే భూమి ఓ వైపునకు వంగి భ్రమించడం వల్ల దీని నీడ చంద్రుడి పై నుంచి లేదా కింద నుంచి వెళ్లిపోతుంటుంది. దీంతో గ్రహణం ఏర్పడదు. ఒక్కోసారి గ్రహణం ఏర్పడే సమయంలో.. భూ వాతావరణం గుండా పయనించే కాంతి చంద్రుడిపై పడుతుంది. దీంతో జాబిల్లి ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. ఈ పరిణామాన్నే బ్లడ్ మూన్గా పిలుస్తారు. భూమిపై వాతావరణంలో మేఘాలు, పారదర్శకతపై ఇది ఆధారపడి ఉంటుంది.