Lok Sabha Elections | న్యూఢిల్లీ, కోల్కతా, ఇంఫాల్, ఏప్రిల్ 19: లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 102 సీట్లకు 21 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలో జరిగిన పోలింగ్లో రాత్రి 7 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2019 ఎన్నికలు (69.43 శాతం) మొదటి విడతతో పోలిస్తే ఇది తక్కువేనని ఈసీ తెలిపింది. పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకే ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరడంతో రాత్రి 7 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. మొదటి విడత ఎన్నికల్లో 1600 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, వారిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. మొదటి విడత పోలింగ్లో అత్యధికంగా తమిళనాడులో-39, రాజస్థాన్లో-12, ఉత్తర ప్రదేశ్లో-8, మధ్య ప్రదేశ్లో-6, ఉత్తరాఖండ్లో-5 లోక్సభ స్థానాలలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ (60), సిక్కిం (32) అసెంబ్లీలకు కూడా శుక్రవారమే పోలింగ్ జరిగింది.
ఈవీఎంలపై ఫిర్యాదులు
ఛత్తీస్గఢ్, మణిపూర్, బెంగాల్ రాష్ర్టాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా రాష్ర్టాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు వెంటనే కలుగజేసుకుని వాటి స్థానంలో వేరేవి ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇద్దరు వృద్ధులు పోలింగ్ బూత్లలో మరణించారు.
మణిపూర్లో గాల్లోకి కాల్పులు
తొలి దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని గాల్గమ్ గ్రామంలో అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్(యూబీజీఎల్) ప్రమాదవశాత్తూ పేలడంతో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ మృతి చెందాడని అధికారులు తెలిపారు. మరో ఘటనలో బైరాంగఢ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చిహ్కా పోలింగ్ కేంద్రం సమీపంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి మరో సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. పశ్చిమబెంగాల్లో కూచ్బెహర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం థమ్నాపోక్పి ఏరియాలో ఓటర్లను చెదరగొట్టేందుకు కొంత మంది సాయుధ వ్యక్తులు గాల్లోకి పలు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
‘ఈశాన్యం’పై కమలం ఆశలు
ఈసారి ఈశాన్య రాష్ర్టాలలో 22 నుంచి 25 ఎంపీ సీట్లను గెల్చుకోవాలని కమలం పార్టీ గట్టి ఆశతో ఉంది. అలాగే మమత ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తి ఈసారి తమకు బెంగాల్కు తమకు మరిన్ని సీట్లు తెస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ఈసారి బ్రేక్ పడుతుందని, ఎస్ రాందాస్కు చెందిన పీఎంకే లాంటి చిన్న పార్టీలతో ఏర్పాటు చేసుకున్న పొత్తు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నది. బీహార్లో నితీశ్తో పొత్తు అనుకూలిస్తుందని భావిస్తున్నది.
ఇండియా కూటమి ఆపసోపాలు
ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోంచి దించాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఆ కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో చేతులు కలిపి ఎన్డీఏ కూటమిలో చేరడం ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది. దీనికి తోడు బెంగాల్లో పొత్తుకు మమతా బెనర్జీ నిరాకరించడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం వంటి చర్యలతో ఆ కూటమి కుదేలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ర్టాలు/యూటీల వారీగా పోలింగ్ శాతం (రాత్రి 7 గంటల వరకు)