భువనేశ్వర్ : విజిటర్స్ క్యాంప్లో కొవిడ్ కలకలం సృష్టించడంతో ఈ వారం చివరలో భువనేశ్వర్లో జరగాల్సిన భారత్ – జర్మనీ పురుషుల హాకీ జట్ల మధ్య జరగాల్సిన ప్రో లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్ను వాయిదా వేసినట్లు ఎఫ్ఐఎఫ్ గవర్నింగ్ బాడీ మంగళవారం తెలిపింది. భువనేశ్వర్లో ఈ నెల 12, 13 తేదీల్లో మ్యాచ్లు షెడ్యూల్ చేయగా.. కొవిడ్ కేసులు జర్మనీ జట్టును ప్రభావితం చేస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం వాయిదాపడ్డ వాటిని మళ్లీ నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడంపై ఎఫ్ఐహెచ్, హాకీ ఇండియా, జర్మనీ పని చేస్తున్నాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత పురుషుల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇదిలా ఉండగా.. మ్యాచ్లు వాయిదా వేయబడినప్పటికీ.. కళింగ స్టేడియంలో ఈ వారాంతంలో భారత్ – జర్మనీ మధ్య మహిళల మ్యాచ్లు అనుకున్న ప్రకారం జరుగుతాయని పాలక మండలి పేర్కొంది. ఇప్పటికే జర్మనీ జట్టు మంగళవారం ఇక్కడకు చేరింది. కళింగ స్టేడియంలో భారత్తో ఆడడంపై కెప్టెన్ లిసా నోల్టే ఆనందం వ్యక్తం చేశారు. కళింగ స్టేడియంలో ఇంతకుముందెన్నడూ ఆడలేదని, అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నామని, ఇంత పెద్ద స్టేడియంలో ఆడడం చాలా అద్భుతంగా ఉంటుందని, దాని కోసం ఎదురుచూస్తున్నామని లీసా పేర్కొంది.