వరి కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. తెలంగాణలో పండించిన వరి కొనుగోళ్లను మోదీ సర్కార్ నిరాకరించడంతో పాటుగా రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలను సమాయాత్తం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సమావేశాల్లో తీర్మానాలకు పిలుపునిచ్చారు. దీన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, బల్దియాలు, మండల, జిల్లా పరిషత్తుల్లో ఇందుకు సంబంధించి తీర్మానాలు చేసిన ప్రతులను కేంద్రానికి పంపించనున్నారు. గులాబీ పార్టీ పోరుకురైతన్నలు మద్దతు తెలియజేస్తున్నారు.
నాగర్కర్నూల్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : వరి రైతుల తరఫున కేంద్రం తీరుపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు రంగంలోకి దిగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భవించాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అన్నదాతల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నది. అలాగే రైతు వేదికలు, వ్యవసాయ కల్లాలు, పంటల సీజన్లలో సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నది. ముఖ్యంగా ప్రాజెక్టుల పూర్తితో బీడు భూములు వరి పైర్లతో పచ్చని మాగాణుల్లా మారాయి. దీంతో ధాన్యాన్ని కరోనా వంటి ఉపద్రవం వచ్చినా కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది. ఇలా రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మాత్రం గత సీజన్ నుంచి తీసుకోవడం లేదు. పంజాబ్వంటి రాష్ర్టాల్లో ధాన్యాన్ని సేకరిస్తూ తెలంగాణపై వివక్షత ప్రదర్శిస్తున్నది. దీంతో గత సీజన్లో ఉమ్మడి పాలమూరుకు ఆరు రైళ్లతో ధాన్యాన్ని తీసుకెళ్లాల్సి ఉండగా.. రాకపోవడంతో గోదాంల్లోనే నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇలా రాష్ట్రంలో ధాన్యం నిల్వలతో ఈ సీజన్లో కొనుగోళ్లు కష్టమవుతాయని గుర్తించిన ప్రభుత్వం ముందే రైతులను సన్నద్ధం చేసింది. వరి పండించొద్దని రైతులను కోరింది. ఫలితంగా చాలా మంది రైతులు వరి సాగును తగ్గించారు. కాగా ఇప్పుడు పండించిన వరితోపాటు వచ్చే సీజన్ల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన టీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసి వరి కొనాల్సిందేనని స్పష్టం చేసింది. రైతుల కోసం తామున్నామనే భరోసా కల్పించేందుకు టీఆర్ఎస్ కార్యక్షేత్రంలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, సింగిల్ విండో, మండల, జిల్లా పరిషత్, మార్కెట్ కమిటీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేపట్టనున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఈ వారంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు
తీర్మానాలు చేపట్టేందుకు సర్పంచులు, ఎంపీపీలు, మార్కెట్, విండో చైర్మన్లు, పాలకవర్గాలకు సూచించారు. కేంద్రం వరి కొనుగోలు చేయాల్సిందేనని ఆయా పాలకవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానిస్తాయి. ఈ తీర్మాన ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి నివేదించనున్నాయి. అనంతరం అలాగే వచ్చే ఏప్రిల్లో భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణకు నిర్ణయించారు. నిరసన దీక్షలతో పాటుగా సెమినార్లు, సదస్సులు నిర్వహించనున్నది. ఈ ఉద్యమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెడుతున్న మెలికను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నది.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధంకావాలి. నాగర్కర్నూల్లో 24వ తేదీన సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నాం. 25న పంచాయతీ, గ్రామ రైతుబంధు కమిటీల తీర్మానాలు, 26న మండల పరిషత్, సింగిల్ విండోలు, మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేస్తాం. 27వ తేదీన ప్రధాన మంత్రికి తీర్మానాల ప్రతులను పంపిస్తాం. ప్రజలందరూ సీఎం కేసీఆర్ పిలుపును విజయవంతం చేయాలి.
– జక్కా రఘునందన్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్, నాగర్కర్నూల్