హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయేతర భూముల కోసం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో, వ్యవసాయ భూముల కోసం మంత్రి హరీశ్రావు నేతృత్వంలో రాష్ట్ర సర్కారు కేబినెట్ సబ్ కమిటీలను వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నతాధికారులు కమిటీకి సమర్పించేందుకు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు ఒక నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది.
దీంతోపాటు వ్యవసాయ భూములపైనా అధికారులు దృష్టిసారించారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ అనధికారిక లేఅవుట్లు, ఇండ్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం తదితర సమస్యలపై దృష్టిసారించనున్నది. సబ్ కమిటీలు త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లోని 1. సీలింగ్ భూములు, 2. అసైన్డ్ భూములు, 3. వక్ఫ్ భూములు, 4. దేవాదాయ భూములు, 5. వక్ఫ్ భూములు, 6. అటవీ భూములు, 7. ఇతర ప్రభుత్వ భూములు, 8. గతంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వ భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో కనిపిస్తే ఆ వివరాలు, 9. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, 10. లీజులో ఉన్న భూములు, 11. గ్రామ కంఠం భూములు, 12. జీవో 166, జీవో 58 కింద క్రమబద్ధీకరణ కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఆదేశించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫార్మా పంపించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే జిల్లా స్థాయిలో వివరాలను క్రోడీకరిస్తారని, ఆ తర్వాత రాష్ట్రస్థాయికి పంపుతారని అధికారులు చెప్పారు.