న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో వడ్డీరేట్లు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ పండుగ సీజన్లో మారుతి, హ్యుందాయ్ మోటర్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదుకానున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేయనున్నప్పటికీ వాహన విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఏడాదంతా జరిగే వాహన అమ్మకాల్లో ఒక పండుగ సీజన్లోనే 23-26 శాతం అమ్ముడవుతాయని చెప్పారు.
ప్యాసింజర్ వాహనాలకు క్రేజ్
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాలకు యమక్రేజీ నెలకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40.5-41 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని అంచనావేసిన ఆయన.. వీటిలో ఈ పండుగ సీజన్లోనే 10 లక్షల యూనిట్లు అమ్ముడుకానున్నట్లు తెలిపారు. 92 రోజుల పాటు జరిగే ఈ పండుగ సీజన్లో మారుతి అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 24 శాతం వృద్ధి పెరిగే అవకాశం ఉన్నదన్నారు. సెప్టెంబర్లో సంస్థ రికార్డు స్థాయి 3.61 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపింది. ఒక నెలలో ఇంతటి స్థాయిలో వాహనాలు విక్రయించడం ఇదే తొలిసారి.