Federal Bank | కొటక్ మహీంద్రా బ్యాంకులో విలీనం వార్తలను మరో ప్రైవేట్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ తోసిపుచ్చింది. దీంతో సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లలో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.129.75కి చేరుకుంది ఇది దాదాపు 8 శాతం ఎక్కువ. కొటక్ మహీంద్రా బ్యాంకులో విలీనంపై చర్చలు జరిగినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా వదంతులేనని ఫెడరల్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.
గత కొన్ని సెషన్లుగా ఫెడరల్ బ్యాంక్ షేర్ 12 శాతం పెరిగింది. రెండు బ్యాంకుల యాజమాన్యాలు ఇటీవల సమావేశమై విలీనం అంశంపై చర్చించాయని ఒక వార్తా సంస్థలో వార్తలొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక (2022-23) సంవత్సరం తొలి త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 8.14 శాతం పెంచుకుంది. గతేడాది రూ.3,355.71 కోట్ల వడ్డీ ఆదాయం సముపార్జించగా, ఈ ఏడాది అది రూ.3,628.86 కోట్లకు చేరింది.
ఫెడరల్ బ్ఆయంక్ గత త్రైమాసికంలో రూ.600.66 కోట్ల నికర లాభం గడించింది. గతేడాది నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.1,418 కోట్లు సంపాదిస్తే, ఈ ఏడాది అది రూ.1,605 కోట్లకు పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు చేపట్టేందుకు ఫెడరల్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులకు గత జూలై నెలాఖరులో అనుమతి లభించింది. ఇందుకోసం ఈ రెండు బ్యాంకులు శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాయి. నెట్ బ్యాంకింగ్ వేదికల ద్వారా పన్ను చెల్లింపులు స్వీకరిస్తున్నాయి.
పన్ను చెల్లింపు దారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోపాటు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్యాస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి పద్ధతుల్లో పన్ను చెల్లిస్తున్నారని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. ఎన్నారైలు, దేవీయ కస్టమర్లు దేశంలోని ఏ శాఖలోనైనా టాక్స్ చలాన్ దాఖలు చేయొచ్చునని వివరించింది.