వానకాలం ప్రారంభమై నెల రోజులైనా వర్షాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు రెండోసారి విత్తనాలు వేశారు. మొలకలు వచ్చాక వర్షాలు ముఖం చాటేయడంతో పత్తి, సోయా, కంది, మక్క మొలకలు వాడిపోతున్నాయి. మరో వారం రోజులు ఎండలు ఇలాగే కొడితే చేలన్నీ ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువులు నిండక ఆయకట్టు కింది దుక్కులు దున్నడం లేదు. వర్షాలపై ఆశతో ఆశతో అక్కడక్కడ నారుమడుల్లో వడ్లు చల్లినప్పటికీ మండుతున్న ఎండలకు నారు ఎదగడం లేదని, దిక్కుతోచని పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
– ఉట్నూర్ రూరల్, జూలై 17
బోథ్, జూలై 17 : బోథ్ మండలంలో 12 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. పత్తి, సోయా, కంది, మక్క, పంటల మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకోనడంతో వరుణ దేవుడి కరుణ కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో సోయా, పత్తి, మక్కా పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. సౌకర్యం లేని రైతులు వాన జాడ కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజులుగా ఆకాశం మేఘవృతమై మబ్బు పట్టి ఉన్నా చినుకు జాడ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉట్నూర్రూరల్, జూలై 17 : నేను రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాను. వర్షాలు లేక పత్తి మొలకలు వాడిపోతున్నాయి. బోరు బావితో నీళ్లు పెడుదామంటే అరగంట కూడా మొటరు నడవడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కు తొచడం లేదు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడకుంటే పంటలు ఎండిపోతాయి. ఆర్థిక భారం పెరిగి అప్పుల పాలు అవుతాము.
-లింగన్న, రైతు, గంగన్నపేట్