పసుపులో ఉండే కుర్కిమిన్ బయోయాక్టివ్గా పనిచేస్తూ కణాల వృద్ధికి, కణజీవక్రియకు మేలు చేస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియలు సాఫీగా సాగేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అందుకే రుచి కలిగించకపోయినా ఈ మేలుని గుర్తించి పసుపుని ఏనాడో ఆహారంలో చేర్చుకున్నారు మనవాళ్లు. నేటి పరిశోధనలూ ఈ విషయాలను ధ్రువపరిచాయి. అయితే.. పసుపుతో కలిగే మేలుని పొందాలనే తాపత్రయంలో పరిమాణాన్ని పెంచుతున్నారే కానీ, ఆశించిన ప్రయోజనం దక్కుతున్నదా? లేదా అని మాత్రం ఆలోచించట్లేదు! పసుపులో నీళ్లు కలిపి ముద్దలుగా మింగడం గృహ వైద్యంలో ఎక్కువగా ఆచరిస్తారు. ఇలా తినడం వల్ల పసుపులో ఉండే కుర్కిమిన్ శరీరంలోకి పోతుంది.
కానీ, ఒంట బట్టదట. కుర్కిమిన్ పూర్తిగా శరీరంలోకి చేరాలంటే పసుపుని నీళ్లలో కలిపి కాకుండా నెయ్యి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్లో కలుపుకొని తీసుకుంటే మేలు. పసుపులోని కుర్కిమిన్ నూనెల్లో కరిగిపోతుంది. కాబట్టి ఇలా జరుగుతుందట. నూనెలు తక్కువగా తినాల్సిన అవసరం ఉన్నవాళ్లు చిటికెడు మిరియాల పొడిలో కాస్త పసుపు పొడి కలుపుకొని తినాలని ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్నారు. మిరియాలలో ఉండే పైపరీన్ పదార్థం వల్ల కుర్కిమిన్ని శరీరం ఎక్కువగా సంగ్రహించేలా చేస్తుంది. ఇవేవీ అందుబాటులో లేకపోతే పప్పు, సబ్జా గింజలు, వంటల్లో కొంత వేసుకుని ఉడికిస్తే పసుపులోని కుర్కిమిన్ శరీరానికి అందుతుంది.