హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వచ్చే వానకాలం నాటికి నిర్దేశిత లక్ష్యం మేరకు రైతులకు ఆయిల్పాం మొక్కలు అందించాలని ఆదేశించారు. రైతు వేదికల ద్వారా పంటల మార్పిడిపై 8,098 శిక్షణ తరగతులు, మొత్తంగా వివిధ అంశాలపై 22,123 శిక్షణ తరగతులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. పత్తికి మద్దతు ధర రూ.6,025కు మించి వివిధ మార్కెట్లలో రూ.7 వేలకు పైగా లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది రైతులు పెద్దఎత్తున పత్తి సాగుచేయాలని సూచించారు.