కాల్వపొంటె కూసొని రైతన్నల ముచ్చట్లు
కొండపోచమ్మ నుంచి సాగునీటి విడుదలపై హర్షం
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 5: యాభైఏండ్ల కింద కాలం మంచిగయితుండే.. మస్తు నీళ్లుండే.. పాములపర్తి కాడ దూద్ఖాన్ చెరువు నిండితే రెండు పంటలు మంచిగ పండేటియి. ఇప్పుడు అంతకన్నా మంచిగా కొండపోచమ్మసాగర్ కట్టిండు పెద్దమనిషి సీఎం కేసీఆర్ సారు అంటూ రైతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి మంగళవారం సీఎం కేసీఆర్ సాగునీటి విడుదల చేస్తున్నారనే సమాచారంతో రైతులు కాల్వ పొంటె గట్లపై కూర్చొని పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా తాము పడ్డ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చిందని సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలో హల్దీవాగులోకి సంగారెడ్డి కెనాల్ ద్వారా, పాములపర్తి వద్ద గజ్వేల్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు.
తమ కాలువల్లో కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు పారుతాయా? అనే ఆతృతతో రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన కాల్వగట్లపై కూర్చుని ఖుషీ అయితున్న పాములపర్తికి చెందిన ఉప్పరి అంజయ్య, చెక్కల చంద్రయ్యను పలుకరించగా.. ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు. వారి మాటల్లోనే..‘యాభైఏండ్ల క్రితం కాలం మంచిగయితుండే. పాములపర్తి కాడ దూద్ఖాన్ చెరువు నిండితే రెండు పంటలు మంచిగ పండేవి. చెరువులు, బాయిలల్ల నీళ్లు బాగుండే ఈతలు కొట్టేటోల్లం. ఈ కాలానికి మనిషిన్ని చాపలు పట్టుకునేటోళ్లం. మంచిగ కూరగాయలు ఉండే. మళ్లీ కాలం వచ్చేదాక మస్తుంగుండే. మోటకొట్టి బాయిలల్లకేళ్లి పొలాలకు నీళ్లు పట్టెటోళ్లం. హూ మళ్లీ ఆ కాలమే కాలేదు ఎప్పుడూ.వానపడితేనే యిత్తనం ఏశేటోళ్లం కాలమయితే మురిశేటోళ్లం.. ఎండిపోతే ఏడిశేటోళ్లం. రైతులమంతా అరిగోస పడ్డం. నీళ్ల కరువు వచ్చినంగా గడికి బోర్లు ఏశేటోళ్లం. అప్పట్ల చంద్రబాబు వచ్చినంక మా బతుకులు మరీ అద్వానమైనయి. టైంకు కరెంటు బిల్లు కట్టకపోతే స్టార్టర్లు గుంజుకపోయినరు. దొంగల రాత్రి కరెంటు వచ్చేది.
ఇంటికి, బాయికాడికి.. బాయికాడికి, ఇంటికి తిరగలేక ఇబ్బంది పడ్డం. కేసీఆర్ వచ్చినంగ మస్తు మంచిగయింది. 24గంటలు కరెంటు వస్తున్నది. రోజంతా కడుపునిండ నీళ్లు తాగుతున్నం. పంటలు మంచిన పండించుకుంటున్నం. కాల్వల నా జాగ కూడా పోయినా.. సారు మస్తు జేస్తుండు. రైతులకు నీళ్లు తెస్తుండు. బోర్లలోకి నీళ్లుకూడా మంచిగ వస్తున్నాయి. పచ్చగ పొలాలు ఉన్నయి. ఇప్పుడు మాకోసం నీళ్లు ఇడుస్తున్నారు. చారాననే జేసిండంట… ఇంకా బారాన పనులు చేయాలి. మళ్లీ కేసీఆర్ వస్తేనే పనులన్నీ అయితయి. మాకు పంట పండించే కష్టాలు మొత్తం పోయినాయి. ఎక్కడ ఖాళీ జాగాకనిపియ్యకుండా పంట పండిస్తం సూడింక’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు.