న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో చోటుచేసుకొన్న మహిళల నగ్న ఊరేగింపు ఘటనకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో సంచలన విషయాలు వెల్లడించింది. తమ గ్రామంలోకి చొరబడిన మూక నుంచి కాపాడాలని, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని అభ్యర్థించిన కుకీ-జో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను పోలీసులే.. దాదాపు వెయ్యి మంది వరకు ఉన్న మూకకు అప్పగించారని పేర్కొన్నది. తర్వాత మైతీ వర్గానికి చెందిన ఆందోళనకారులు, బాధిత మహిళలను వివస్త్రను చేశారని, లైంగిక దాడికి ముందు రోడ్లపై ఊరేగించారని చెప్పింది.
బాధిత మహిళల్లో ఒకరు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని పోలీసులను కోరగా.. ముందు వాహనం తాళం లేదని చెప్పారని, ఆ తర్వాత బాధిత మహిళలతోపాటు పలువురు ఇతర బాధితులు కూర్చొని ఉన్న వాహనాన్ని పోలీసు డ్రైవర్ నేరుగా మూక వద్దకు తీసుకెళ్లి ఆపారని సీబీఐ తన చార్జిషీట్లో వివరించింది. గత ఏడాది మే 4న ఇద్దరు మహిళలను రోడ్లపై నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత జూలైలో సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.