హైదరాబాద్ : రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ‘రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఫర్ పడరిజం షిఫ్ట్ టువార్డ్స్ స్ట్రక్చరల్ ఛేంజెస్ అగ్రికల్చరల్ వాల్యు చైన్ – ఆపర్చునిటీస్ అహీడ్’ అనే అంశంపై జాతీయ సెబినార్ జరగ్గా.. పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.
రైతులకు ఆర్థికంగా మేలు కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అనుసరించాలని విధానాల రూపకల్పనపై చర్చించారు. ఉదాహరణకు అమూల్ పాలు విక్రయించిన తర్వాత తయారు చేసే స్వీట్లు, పెరుగు, ఇతర పానియాల విక్రయాల్లో రైతులకు వాటా దక్కుతోందని, ఇదే తరహా పద్ధతి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్లో అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమూల్ తరహాలోనే కరీంనగర్ డెయిరీలోనూ అమలు జరుగుతుండడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితులు ఆచరణలోకి వస్తే రైతులకు ఆర్థికంగా భరోసా ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితుల ఆచరణలోకి వచ్చేలా దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని నిపుణులు స్పష్టం చేశారు. రైతులు సమష్టిగా ఉంటే గిట్టుబాటు ధరలు పొందవచ్చని, పంటల సాగు విషయంలో కొత్తదనాన్ని ఆవిష్కరించొచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని వ్యవసాయరంగ నిపుణులు అన్నారు.
సెమినార్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక చర్యలతో ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ అర్త్ నీతి నివేదికలో స్పష్టంగా పేర్కొందని తెలిపారు.
వ్యవసాయ, అనుబంధ సంస్థల్లో తెలంగాణ ఆవిర్భావానికి ముందు రెండు శాతం ఉన్న వృద్ధి ప్రస్తుతం 16.5 శాతానికి చేరుకుందని అన్నారు. వ్యవసాయం, ఫిషరీస్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీలో రూ.76,123 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.1,84,321 కోట్లకు తెలంగాణ చేరిందని వివరించారు. వరి స్థూల విలువ రూ.9,528 కోట్ల నుంచి రూ.47,440 కోట్లకు చేరిందని, కందుల విలువ రూ.530 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు చేరిందని, తలసరి ఆదాయం రూ.1,24,104 నుంచి రూ.2,37,632కు చేరిందని వివరించారు.
సెమినార్లో కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ శాస్త్రి, వ్యవసాయ రంగ నిపుణులు అమితాబ్ కుండు, రవీంద్ర ధారియా, రాజ్వీర్ శర్మ, కేకే త్రిపాఠి, జీ అగర్వాల్, వినీత హరిహరన్, ఖుషీ రాధ్య, మోహన్ కందా, బినోద్ ఆనంద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీజీజీ డీజీ రాజేంద్ర నింజే, డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.