Karimnagar Farmers | ముకరంపుర, మే 25: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. మార్కెట్కు వచ్చే మామిడి రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు లోపలికి రాకుండా మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసివేశారు. దీంతో మార్కెట్ ప్రధాన ద్వారం ముందు రద్దీ ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
మార్కెట్ లో గత నెల 20 న మార్క్ఫెడ్ తరఫునా డీసీఎంఎస్ మక్కల కొనుగోళ్లు చేపట్టింది. ఒక్కో రైతు మార్కెట్కు మక్కలు తెచ్చి 20 రోజులైనా ఇంతవరకు కొనుగోళ్లు జరగక ఎండలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులే స్వయంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే బస్తాలను సకాలంలో తూకం వేసి లారీల్లో లోడింగ్ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ నిర్వాహకులు రైతుల ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గత 15 రోజుల క్రితం మార్కెట్ కు మక్కలు తెచ్చి పోసిన ఇంత వరకు ప్రభుత్వం కొనలేదని, ఊరి నుంచి మార్కెట్ కు వచ్చి పోవడానికి, తిండి కోసం రూ.500 దాకా ఖర్చు అవుతుందని బద్దిపల్లి, కొత్తపల్లికి చెందిన రైతులు తిరుపతి, బీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.