అమరావతి : తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు . సీజేఐగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొట్ట మొదటి సారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా నాటి నుంచి నేటి వరకు గ్రామస్థులంతా ఐక్యతగా ఉండడం గర్వంగా ఉందని, ఇదే వాతావరణం కొనసాగించాలని, అన్ని కులాలు, మతాలు కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
జస్టిస్ ఎన్వీ రమణ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి బాల్య మిత్రుడు శివలింగ ప్రసాద్తో కలిసి గ్రామంలో రోడ్లు, చెరువు కట్టలు, పంట పొలాల్లో సంతోషంగా గడిపేవారమని గుర్తుచేశారు. తమ ప్రాంతం చైతన్యం గల ప్రాంతమని అన్నారు. దేశమంతా అభివృద్ధి చెందినప్పటికీ కూడా తమ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదని ఆవేదన తనలో ఉందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కారం అయ్యేదాకా పట్టుదలతో ఉండాలని సూచించారు.
తాను ఎక్కడికీ వెళ్లినా తెలుగు వారి గొప్పదనాన్ని అందరూ ప్రశంసిస్తుండడం గర్వంగా ఉందని అన్నారు. అప్ఘానిస్తాన్లో పార్లమెంట్ భవనాన్ని కూడా తెలుగు వారే నిర్మించారు. కరోనా కష్టకాలంలో కరోనా మందును కనుగొన్న తెలుగువారు భారత్ బయోటెక్ ఎల్లాకృష్ణా, సుచిత్ర దంపతులు కావడం మనందరం గర్వపడాలని అన్నారు. తెలుగు జాతికి సరైనా గుర్తింపులేదని ఆవేదన తనలో ఉందని , అయితే తెలుగు భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను , తెలుగు చైతన్యా న్నిపటిష్ట పరుచుకోవాలని సూచించారు. రైతులందరూ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలు లేకపోవడం, భూ సమస్య వివాదాలు అధిగమించాలంటే ఐక్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు , మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.