నిర్మల్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే ఫైనల్ కాదనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రజల అభ్యంతరాలను, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదన్నారు. ప్రతి పక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మి మీరు మోసపోవద్దని సూచించారు. గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూస్తామని మంత్రి రైతులకు వివరించారు.
దీంతో మంత్రి హామీ మేరకు దీక్షను విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు. మంత్రి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తాను 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసిటన్లు పత్రికల్లో వచ్చాయి. నిరాధార ఆరోపణలు చేయడం కాదు.
నాకు ఎక్కడ భూమి ఉందో ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేదంటే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. నిజాయితీగా ఉన్నాము కాబట్టే మూడు దశాబ్దాలకు పైగా ప్రజలు మమ్మల్ని ఆదిరిస్తున్నారని పేర్కొన్నారు.