యాదాద్రి భువనగిరి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గుండాల: ‘మీరు కేంద్రంలో అధికారంల ఉన్నరు. మీ కేంద్ర మంత్రికి ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీ మంత్రి ఎందుకు రాడు. మా వడ్లు ఎందుకు కొనడో తేల్చుకుంటం’.. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ధాన్యం పరిశీలనకు వచ్చిన బీజేపీ నేతలకు రైతు యెలిపెద్ది యాదవరెడ్డి నుంచి ఎదురైన ప్రతిఘటన. ‘జెండాలు పట్టుకొని రైతులకు కనబడుడు.. కల్లాల వద్ద మొసలి కన్నీరు కార్చుడు కాదు.. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వడ్లు కొనిపించండి’ అని కమలం నాయకులను కల్లంలోనే నిలబెట్టి కడిగేశారు. ధాన్యం కొనబోమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం తేల్చిచెప్తుండగా, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లాల వద్ద ఆడుతున్న డ్రామాలను రైతులు తిప్పికొడుతున్నారు.
మంగళవారం గుండాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వచ్చిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్తోపాటు పలువురు నాయకులను రైతులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే రాష్ట్రంలో డ్రామా లు ఆడుతూ, రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మా వడ్లను ఎందుకు కొనదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ప్రశ్నల దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన బీజేపీ నేతలు.. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రైతుల నిరసన తీవ్రతరం కావడంతో పట్టుమని 10 నిమిషాలు కూడా వారి పర్యటన సాగలేదు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పరిశీలన పేరుతో చేపట్టిన యాత్రతో పరాభవం పాలైన కాషాయ పార్టీ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోమారు భంగపాటుకు గురైంది. కేంద్రం ధాన్యం కొంటదా, కొనదా తేల్చండని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నిలదీసిన ఘటనను మరువక ముందే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు బీజేపీ నేతలను కడిగేశారు. యాత్రల పేరుతో మొసలి కన్నీరు కార్చడం కాదు.. చేతనైతే కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ వడ్లు కొనిపించాలని డిమాండ్చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగుకు నీళ్లు, ఉచిత కరంటు ఇచ్చి ధాన్యం కొంటుంటే.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేది లేదంటూ రైతుల బతుకులతో ఆడుకుంటున్నదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధుతో మంచిగా వ్యవసాయం చేసుకుంటుంటే.. వడ్లు కొనమని చెప్తూ కేంద్ర ప్రభుత్వం రైతుకు బతుకే లేకుండా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు చుట్టుముట్టి ప్రశ్నలు అడుగుతుండటంతో చేసేది లేక అసహనంతో బీజేపి నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.