కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/అంబేద్కర్ చౌక్, డిసెంబర్ 30 : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సరైన గిట్టుబాటు కల్పించడం లేదంటూ రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు జిల్లా కేంద్రంలో ర్యాలీ తీస్తూ అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యా హ్నం 3 గంటల వరకు కొనసాగింది. నాలుగు గంటల పాటు రవాణా స్తంభించిపోయింది. సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రారంభంలో పత్తికి క్వింటాలుకు రూ. 8600 చెల్లించిన వ్యాపారులు క్రమంగా ధర తగ్గించి ప్రస్తుతం రూ. 7,500 వేలకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేస్తారని, ఈ ఏడాది అధిక వర్షాలతో దిగుబడి తగ్గిందని తెలిపారు. గతేడాది క్వింటాలుకు రూ. 10 వేలకు పైగా చెల్లించడంతో ఈ ఏడాది అధికంగా పత్తి సాగు చేశారని, ఇప్పుడు ధర తగ్గించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మక్కై పత్తి ధర తగ్గించి కొంటూ నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి క్వింటాలుకు రూ. 12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేసామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఆపై ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. సీసీఐ, వ్యాపారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతిపత్రం అందించారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ సీసీఐ అధికారులతో పాటు జిన్నింగ్ వ్యాపారులతో సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధర కల్పించేలా చూస్తానని, ఈ సమావేశానికి కొంత మంది రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా హాజరుకావాలని ఆయన కోరారు.