నమస్తే తెలంగాణ నెట్వర్క్: అన్నదాతకు రైతుబంధు సాయంతో బీడు భూములు సాగులోకి వచ్చి చేను, చెలక మురుస్తున్నాయి. పచ్చని పొలాలు ధాన్య సిరులు కురిపిస్తుండటంతో రైతు కుటుంబాలు సంబురపడిపోతున్నాయి. నాలుగేండ్లలో రైతన్నలకు రూ. 50 వేల కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించడంతో ఊరూరా సంబురాలు మిన్నంటుతున్నాయి. సీఎం కేసీఆర్ను రైతుబాంధవుడిగా కొనియాడుతూ సోమవారం రైతులు పంట పొలాల్లో, ఎడ్ల బండ్లపై చిత్రపటాలను ఉంచి క్షీరాభిషేకాలు జరిపా రు.
పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయిం గ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో రైతులు ఎడ్లబండిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించి క్షీరాభిషేకం చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య ఎడ్ల బండితో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం డోడర్న, మాలేగావ్, తానూర్లలో, మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి, భీమారంలోని రైతు వేదికల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8,9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, ఉపన్యాస, పోటీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలోని రైతువేదిక భవనంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో రైతు నల్లబోలు శ్రీనివాస్రెడ్డి తన పొలంలో ఇంటి అవసరాల కోసం సాగుచేసుకుంటున్న వరినారుతో సీఎం కేసీఆర్, రైతుబంధు పేర్లను ఎమ్మెల్యే కిషన్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి నాటారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, నెల్లికుదురు మండలం వావిలాలలో ఎమ్మెల్యే శంకర్నాయక్ రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రైతులతో కలిసి ఎడ్లబండి తోలారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం ఉప్పుసాకలో విప్ రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేడుకల్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో పాల్గొన్నాయి.