మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 6 : అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన సామకూరి వెంకన్న (51) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతేడాది తనకున్న మూడు ఎకరాలతోపాటుగా అదే గ్రామంలో ఐదు ఎకరాలను కౌలు తీసుకొని మిర్చి పంట వేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో రూ.ఐదు లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.ఆరు లక్షల అప్పు చేశాడు. మిర్చి తోటకు చీడపీడలు సోకి దిగుబడి రాలేదు.
ఈ ఏడాది రెండు ఎకరాల పొలం సాగుచేశాడు. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.14 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి రాక చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.