గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలమండలి కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారింది. ప్రజల అవసరాలను తీర్చే అన్ని వ్యవస్థలతో పాటు జలమండలిని భ్రష్టు పట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జలమండలిని ఓఆర్ఆర్ లోపలి దాకా విస్తరించినా.. ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం చేశారు. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టాక రాజకీయ ప్రయోజనాల కోసం సరైన విధానాలతో ఉన్న జలమండలిని అశాస్త్రీయంగా విస్తరించి ఆగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విస్తరణ వల్ల ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా ఏయే డివిజన్లు ఎవరి పరిధిలోకి వస్తాయి? ఏ సర్కిళ్లు ఎంత వరకు విస్తరించి ఉన్నాయి? ఆ సర్కిళ్లు, డివిజన్ల పరిధిలో ఏయే ప్రాంతాలు చేరాయో ఇప్పటికీ తెలియని దుస్థితి నెలకొన్నది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్లకే తమ ఆధీనంలో ఏ ప్రాంతాలు ఉన్నాయో తెలియని విచిత్ర పరిస్థితులు జలమండలిలో నెలకొన్నాయి. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసినట్లుగానే దానికి సమాంతరంగా జలమండలిని మూడు ముక్కలుగా విభజించి.. ఓఆర్ఆర్ బయటదాకా విస్తరించారు. మూడు కమిషనరేట్ల పరిధి వరకు విస్తరించడమే లక్ష్యం చేసుకున్నారు. కానీ ఆయా ప్రాంతాలకు విస్తరిస్తే పరిపాలన, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన ఎంతవరకు సాధ్యమవుతుందని ఆలోచించలేదు. దీంతో శివారు ప్రాంతాలపై జలమండలి అధికారులకు ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పాలనలో తీవ్రమైన వైఫల్యాల వల్ల అధికారులు, వినియోగదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెరగని సిబ్బంది.. తగ్గిన బడ్జెట్
జలమండలిని విస్తరించినా.. అందుకు తగ్గట్లు సిబ్బందిని పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పుడున్న ఉద్యోగులకే స్థాయిని బట్టి రెండు మూడు ప్రాంతాల్లో అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఏ ప్రాంతంపై పూర్తి దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేసి ఉన్నాయి. గత జూన్ నెలలో ప్రభుత్వం 735 పోస్టులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ పోస్టుల్లో సీజీఎం నుంచి ఎస్పీఈ దాకా వివిధ విభాగాల్లో ఆయా కేటగిరీల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటి దాకా ఆ ఫైల్లో కదలిక కనిపించలేదు. అదే విధంగా పరిధి పెరిగినా బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చేయి చూపుతున్నారు. పరిధి విస్తరించక ముందు గత బడ్జెట్లో రూ. 3,385 కోట్లను కేటాయిస్తే ఈసారి రూ.80 కోట్లు తగ్గించి రూ. 3,305 నిధులను కేటాయించింది. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న జలమండలిని విస్తరించి మరింత కిందికి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా జలమండలిని మరో వెయ్యి రోజులు వెనక్కి నెట్టేస్తున్నారు.
విస్తరణ ఘనం.. సేవలు శూన్యం
జలమండలిని జీహెచ్ఎంసీకి సమాంతరంగా ఓఆర్ఆర్ బయటి మున్సిపాలిటీలకు విస్తరించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలో పరిధిలో మూడు జోన్లుగా విస్తరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరికి ముగ్గురు ఈడీలను నియమించారు. మొత్తం పరిధిని 1450 చదరపు కిలోమీటర్లకు విస్తరించి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా 650 చదరపు కిలోమీటర్ల మేర మురుగు వ్యర్థాల నిర్వహణను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కానీ విస్తరించి ఏడాది గడుస్తున్నా నూతనంగా విలీమైన ప్రాంతాల్లో జలమండలి కార్యకలాపాలు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.
విలీనమైన ఆయా మున్సిపాలిటీల పాత పైపులైన్లు, పాత నీటి వనరుల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఇప్పటి వరకు ఒక్క నీటి రిజర్వాయర్ ఏర్పాటు చేయలేదు. పాత పైపులైన్లను పునరుద్ధరించలేదు. నీటి బిల్లులు మాత్రం టంఛనుగా వసూలు చేస్తున్నారు. కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులను అడిగితే నీటి సరఫరా, మురుగు నిర్వహణ జలమండలి పరిధిలో ఉందని.. వారినే అడగాలని బదులిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
పెండింగ్ బిల్లుల పేరిట వేధింపులు
జలమండలి విలీన మున్సిపాలిటీలు, గ్రామాల ప్రజలపై నల్లా బిల్లుల మోత మోగిస్తున్నది. విస్తరణలో భాగంగా విలీనమైన ప్రాంతాల ప్రజలను పెండింగ్ బెడద వేధిస్తున్నది. జలమండలిలో చేరిస్తే తాగునీటి సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు వేలాది రూపాయల బిల్లుల భారం మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే నీటి సరఫరా కొనసాగిస్తామని క్షేత్రస్థాయి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ల రిపేర్లు ఏర్పడినా, పైపులైన్ల సమస్యలు తలెత్తినా మరమ్మతుల చేయకుండా పెండింగ్ బిల్లులను సాకుగా చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
మంచినీటి సరఫరాకు అంతరాయం, లోప్రెషర్, కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులను ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కొత్తగా జలమండలిలో కలిసినందుకు అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో లేని కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నారని వాపోతున్నారు. 2021 జీవోను ఇప్పుడెలా అమలు చేస్తారని జలమండలి అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాత జీవోలను పక్కన పెట్టి జలమండలిలో విలీనమైనప్పటి నుంచే బిల్లులు వసూలు చేయాలని కోరుతున్నారు.