నల్లబెల్లి, మార్చి 27: నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. చేసిన అప్పుల తీర్చే మార్గం లేక వారం క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామానికి చెందిన రైతు నునావత్ నవీన్ (27) తనకున్న 1.27 ఎకరాల భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు.
అందులో పత్తి, మిర్చి, మక్కజొన్న సాగు చేశాడు. పంట పెట్టుబడి కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో బోరుబావి అడుగంటిపోయింది. చేతికందే దశలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. తీవ్రమనస్తాపం చెందిన నవీన్ ఈ నెల 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. నవీన్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.