మోదీ సాహెబ్.. మీరు చేతులు ముడుచుకు కూర్చున్నారు. ‘మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధరపై మీరు హామీ ఇవ్వాలి. వ్యవసాయ రంగాన్ని మీరు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. మరి రైతులు ఏమి చేయాలి? పంట వేసేందుకు డబ్బిచ్చిన వాళ్లు బెదిరిస్తున్నారు. సహకార బ్యాంకు అధికారులు తిట్లు విసురుతున్నారు. పంటను మార్కెట్కు తీసుకువెళ్లే స్థోమత కూడా మాకు లేదు. న్యాయం కోసం మేం ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీరు చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దయచేసి మా పంటలకు తగిన ధరను ఇవ్వండి. మేం బిచ్చం అడగడం లేదు.. అది మా హక్కు. హ్యాపీ బర్త్డే మోదీ’
– దశరథ్ లక్ష్మణ్ కేదారి సూసైడ్ నోట్
గత తొమ్మిదినెలల కాలంలో మహారాష్ట్రలో 2,600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క విదర్భ జిల్లాలోనే 1,080 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
– శివసేన నేతలు
పుణె, సెప్టెంబర్ 19: దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో ధర వచ్చినప్పుడు అమ్ముకుందాంలే అని ఉల్లిని నిల్వ చేశాడు. అందుకూ కొంత ఖర్చయింది. కానీ ఉల్లి ధర పెరగలేదు. ఈ లోగా వర్షాలు పడి సగం ఉల్లి పాడైంది. ఈ నష్టం కూడా అతడి మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. పట్టు వదలకుండా అదే పొలంలో టమాట, సోయాబీన్ వేశాడు. మొదటి వర్షాలకు టమాట దెబ్బతిన్నది. మొన్నటి భారీ వర్షాలకు సోయాబీన్ కూడా చేజారిపోయింది. పరిహారం కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్లి రెండు గంటలు వేచిచూసినా ఫలితం దక్కలేదు. దాంతో అతడికి ఇంటికి వెళ్లేందుకు ధైర్యం చాలలేదు. చావే మార్గమని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం రంగంలో మోదీ నిర్వాకాన్ని చీల్చిచెండాడుతూ ఆత్మహత్య లేఖరాశాడు.
పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మోదీ నిష్క్రియాపరత్వం వల్ల రైతులకు మద్దతుధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ లోకానికి సెలవు చెప్పాడు. మద్దతు ధర రైతుల హక్కని, అది ఇస్తేగానీ రైతుల జీవితాలు బాగుపడవని మోదీ సర్కారును దీనంగా అర్థించాడు. పుణె జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. మృతుడిని జున్నార్ తాలూకా వడగావ్ ఆనంద్ గ్రామానికి చెందిన దశరథ్ లక్ష్మణ్ కేదారిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకొనే ముందు రైతు స్వదస్తూరీతో రాసిన లేఖలో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపాడని అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం, వడ్డీవ్యాపారుల వేధింపులు అధికం కావడాన్ని ప్రస్తావించాడు. మృతుడి వద్ద నుంచి ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రైతుల కష్టాలను అటు కేంద్రం, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించకోవడం లేదని రైతు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా కల్లోలం, భారీ వర్షాల కారణంగా రైతులు నష్టాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు. ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపాడు. పంటలకు కనీస మద్దతు ధర కావాలని డిమాండ్ చేశాడు.
‘మా దగ్గర డబ్బు లేదు. వడ్డీవ్యాపారులు నాలుగు రోజులు ఆగమంటే వినడం లేదు. ఈ పరిస్థితుల్లో మేం ఏం చేయగలం? పండించిన ఉల్లిపాయలు మార్కెట్కు తీసుకువెళ్లే స్థోమత కూడా మాకు లేదు. మోదీ సాహెబ్, మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. పండించిన పంటకు కనీస మద్దతుధరపై మీరు హామీ ఇవ్వాలి. వ్యవసాయ రంగాన్ని మీరు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. మరి రైతులు ఏమి చేయాలి? పంట వేసేందుకు డబ్బిచ్చిన వాళ్లు బెదిరిస్తున్నారు. సహకార బ్యాంకు అధికారులు తిట్లు విసురుతున్నారు. న్యాయం కోసం మేం ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీరు చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దయచేసి మా పంటలకు తగిన ధరను ఇవ్వండి. అది మా హక్కు’ అని రైతు కేదారి ఆత్మహత్య లేఖలో రాశాడు. రైతు ఆత్మహత్య వార్త తెలుసుకొన్న పుణె రూరల్ పోలీసు అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివెళ్లి మృతదేహానికి పోస్ట్మార్టం జరిపించారు. ఆదివారం రాత్రే రైతు అంత్యక్రియలు జరిగాయి. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతిని ప్రమాద మరణంగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అలెఫాటా స్టేషన్ పోలీసులు తెలిపారు.
ప్రధాని హామీలు అమలుకు నోచుకోలేదు
రైతు ఆత్మహత్యపై శివసేన నాయకులు కిషోర్ తివారీ, మనీషా కయాండే స్పందిస్తూ.. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చాయ్పై చర్చా సందర్భంగా రైతులతో మాట్లాడిన మోదీ.. వారికి కనీస మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం, ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి సులభంగా రుణ సదుపాయం, పంట బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఏవీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ‘ఓ రైతు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి తన చితిపైకి ఎక్కాడు.. కానీ మోదీ మాత్రం దేశానికి చీతాలను తేవడంలో బిజీగా ఉన్నారు. ఇదీ ఈ దేశ దుర్గతి’ అని వారు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క విదర్భ జిల్లాలోనే 1080 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇక మహారాష్ట్ర మొత్తంగా ఈ తొమ్మిది నెలల్లో 2,600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
మహారాష్ట్రలో ‘చిత్తడి కరువు’
అహ్మద్నగర్ (మహారాష్ట్ర), సెప్టెంబర్ 19: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అహ్మద్నగర్ జిల్లాలోని గిరిజన ప్రాంతమైన అకోల్ తాలూకాలో ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితోపాటు పలు ఇతర పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అక్కడ వర్షాలు ఆలస్యంగా రావడంతో వరిసాగు ఆలస్యంగా మొదలైంది. ఆ తర్వాత జూలై నుంచి ఈ నెల వరకు వరుసగా భారీ వర్షాలు కురవడంతో రైతుల పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధిత రైతుల్లో ‘విత్తనమాత’గా ఖ్యాతి పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రహిబాయి పోపెర్ సైతం ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ‘చిత్తడి కరువు’ (వెట్ డ్రౌట్) ఏర్పడినట్టు ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతున్నారు.