Kerala | చట్టాన్ని ఉల్లంఘించడాన్ని కొందరు తమ హక్కుగా భావిస్తారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విమర్శించారు. కేరళ యూనివర్సిటీలో సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి వివరణ కోరనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలి. యూనివర్సిటీ క్యాంపస్లో ఎన్నికల ప్రచారంపై పూర్తి నిషేధం ఉంది.
అటువంటి పరిస్థితిలో, విశ్వవిద్యాలయ పరిపాలన ఈ నిషేధాన్ని విస్మరించి, ఎవరైనా సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతిస్తే.. నేను వివరణ కోరాల్సి ఉంటుంది. కానీ, నాకు తెలిసినంత వరకు, విశ్వవిద్యాలయ పరిపాలన సమావేశం నిర్వహించడానికి నిరాకరించింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి. సమస్య ఏమిటంటే కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించడం తమహక్కుగా భావిస్తారు’ అన్నారు.
విషయమేంటంటే.. సీపీఐఎం నేత జాన్ బ్రిట్టాస్ ఇటీవల కేరళ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని ఆరోపణలున్నాయి. వాస్తవానికి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో ఎన్నికల ప్రచారం చేయడం నిషేధం. అయితే, ఇది నెలవారీ కార్యక్రమని.. ఇది ప్రజా కార్యక్రమం కాదని అసోసియేషన్ పేర్కొంది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఈసీ సైతం నోటీసులు జారీ చేసింది.