బోధన్, జనవరి 16: నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ.. తన కుటుంబ పోషణకోసం నడుపుతున్న రైస్మిల్లును, రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ పత్రిక అవాస్తవమైన వార్తలు రాయడాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఖండించారు. తన రైస్ మిల్లుపై తప్పుడు వార్తలు రాసి, బ్లాక్మెయిలింగ్ కుట్రకు తెరలేపిన కారకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఓ పత్రికలో ఎమ్మెల్యే షకీల్కు చెందిన రైస్మిల్లు కస్టమ్ మిల్లింగ్ అక్రమాలకు పాల్పడిందంటూ కథనం రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన బోధన్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రూపాయి పెట్టుబడి లేకుండా తాను రైస్మిల్లులను పెట్టానని, రూ.120 కోట్ల కస్టమ్ మిల్లింగ్ ధాన్యానికి సంబంధించి మోసం చేశానంటూ ఆ పత్రికలో కథనం ప్రచురించారని తెలిపారు. ఇందులో ఒక శాతం నిజమున్నా.. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగంగా ఉరిశిక్షకు సిద్ధమని షకీల్ సవాల్ విసిరారు. తనను అప్రతిష్ఠపాలు చేసేలా ఈ కథనం రావడంతో తాను తీవ్రమైన ఆవేదనకు గురయ్యాయని పేర్కొన్నారు.
తనపై కథనం వచ్చిన వెంటనే తన రైస్మిల్లుకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్పై విచారణ జరపాలని, జిల్లా కలెక్టర్ను, ఇతర జిల్లా ఉన్నతాధికారులకు స్వయంగా తానే ఫోన్చేసి కోరినట్టు తెలిపారు. అధికారుల విచారణలో ఒక గ్రాము కస్టమ్ ధాన్యం, బియ్యం దుర్వినియోగం కాలేదని తేలిందని స్పష్టంచేశారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే వ్యక్తులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. గత ఏడాది వానకాలానికి సంబంధించి అన్ని రైస్ మిల్లుల కన్నా ముందే తాను కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించానని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆ తర్వాత యాసంగి సీజన్కు సంబంధించి 14 శాతం కస్టమ్ బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా, తమ రైస్మిల్లు నుంచి 11 శాతం అప్పగించామని చెప్పారు. మిగతా 3 శాతం కూడా ఇవ్వడానికి తాము సిద్ధపడగా, గోదాములు ఖాళీలేక ప్రభుత్వం తీసుకోలేదని వివరించారు. విదేశాలకు బియ్యం ఎగుమతిదారుడిగా తనకు పేరుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే షకీల్ స్పష్టంచేశారు.