రామగిరి/నకిరేకల్/మునుగోడు,సెప్టెంబర్ 20 ; ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ యాప్లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు. టీచర్లు తమ పాఠశాలకు పంపిణీ చేసిన ట్యాబ్ లేదా స్మార్ట్ఫోన్లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి తరగతి గదిలోని 15-20 మంది హాజరు ఫోర్ట్ ద్వారా తీసుకోవచ్చు. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,859 పాఠశాలలకుగానూ 2,473 పాఠశాలల్లో ఎఫ్ఆర్సీ పూర్తికాగా 386 స్కూళ్లల్లో నమోదు జరుగుతున్నది. మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూని ఫామ్ పంపిణీ వంటివి పారదర్శకంగా అమలు అవడానికి ఈ యాప్ ఉపయోగపడనున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న సర్కార్ ఆ దిశగా పలు పథకాలను అమలు చేస్తున్నది. పాఠశాలల్లో పిల్లల నమోదు పక్కా ఉండేలా చైల్డ్ ఇనోఫోను కొసాగిస్తుండగా తాజా మరో వినూత్న అంశానికి శ్రీకారం చుట్టింది. సాధారణ తరగతి గది హాజరుకాకుండా ప్రతి విద్యార్థి హాజరును ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)తో నమోదు చేస్తుండటంతో ఇక బోగస్ విద్యార్థులకు చెక్ పడనున్నది. ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్, ట్యాబ్ల ద్వారా విద్యార్థుల ముఖాలను స్కాన్ చేస్తే హాజరు నమోదవుతుంది. ఉమ్మడి జిల్లాలో 2,859 పాఠశాలల్లోని విద్యార్థుల వివరాల నమోదులో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. దీంతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు క్షణాల్లో వివరాలు చేరుతాయి. ఎంతమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు తదితర వివరాలు
ఆన్లైన్లో కనిపిస్తాయి.
11 నుంచే విద్యార్థుల రిజిస్ట్రేషన్ మొదలు..
ఫ్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల హాజరు నమోదుకు ఫేషియల్ అటెండ్స్ విధానాన్ని ప్రభుత్వం, విద్యాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలల్లోని యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆదేశాలతో ఈ నెల 11నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తూ యాప్లో నమోదు చేస్తున్నారు.
బోగస్ హాజరుకు చెక్..
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల నమోదును యూడైస్ ఆధారంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. అయితే విద్యార్థుల హాజరు మాత్రం సాధారణంగా(మ్యాన్వల్ పద్ధతి)కొనసాగుతుంది. అయితే సర్కార్ బడులకు వచ్చే పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు ఉచితంగా పాఠశాల యూనిఫాం, పాఠ్య, నోటు పుస్తకాలు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. విద్యార్థులు పాఠశాలలకు రాన్నప్పటికీ కొందరు ఉపాధ్యాయులు వారి హాజరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్సీ)తో బోగస్ హాజరు నమోదుకు తెరపడనున్నది. ఇదిలా ఉంటే మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ సైతం యాప్లో నమోదు చేయాల్సి ఉంది. మరో వైపు తరగతి గదిలోకి వెళ్లి ఒకే పర్యాయం ఆ తరగతిలో విద్యార్థుల గ్రూప్ ఫొటో తీస్తే చాలు.. ఎవరు హజరయ్యారనే అంశాన్ని సైతం యాప్లో వస్తుండటంతో ఇక బోగస్ హాజరుకు చెక్
పడనున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాఠశాలలు, విద్యార్థులు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2,859 ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్, యూఆర్ఎస్(అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్)పాఠశాలలున్నాయి. వీటిలో 2,04,109 మంది విద్యార్థుల వివరాల నమోదు చేయడంతోపాటు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)తో హాజరు నమోదు చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో 2,859 పాఠశాలలకు గానూ 2,473 పాఠశాలల్లో ఎఫ్ఆర్సీ పూర్తికాగా 386 పాఠశాలల్లో నమోదు జరుగుతుంది. ఈ పాఠశాలల్లో ఇంకా 83,541మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్
విద్యార్థుల ఎఫ్ఆర్సీ నమోదులో తలెత్తే సాంకేతిక, నెట్వర్క్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేశారు. 8520083979, 7995550960 నంబర్లలో సంప్రదించి సాంకేతిక సమస్యలు పరిష్కరించుకే అవకాశం కల్పించారు.
విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నాం
విద్యాశాఖ సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి ఆధ్వర్యంలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)యాప్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,284 పాఠశాలకు గానూ సోమవారం వరకు 965 పాఠశాలల్లో పూర్తి చేయగా మిగిలిన పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయులు వేగవంతంగా నమోదు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని 80 శాతం పాఠశాలల్లో పూర్తి కాగా, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల ముఖం స్కాన్చేసి హాజరు నమోదు చేస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ హాజరు ద్వారా నిత్యం ఆయా పాఠశాలల్లో ఎంత మంది మధ్యాహ్న భోజనం తిన్నారనే అంశం సులభంగా తెలుస్తుంది. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
యాప్తో సమస్త సమాచారం తెలుస్తుంది
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆరు రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫొటోలు తీసి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ను యూప్లో నమోదు చేస్తున్నాం. దీని వల్ల ప్రతి విద్యార్థి సమస్త సమాచారం తెలుస్తుంది. నిత్యం పాఠశాలకు ఎంత మంది విద్యార్థులు వస్తున్నారు. ఎంతమంది భోజనం చేస్తున్నారు తదితర విషయాలన్నీ తెలుస్తాయి.
-కూకుంట్ల నర్సింహ, ఎంఈఓ, మునుగోడు
ఎఫ్ఆర్ఎస్తో కలిగే ప్రయోజనాలు..